అరుణ్ జైట్లీకి నివాళి, పప్పులో కాలేసిన నేత, సీఎం కొడుకు ఎప్పుడు సీఎం అయ్యారు?
బెంగళూరు: కేంద్ర మాజీ ఆర్థిక శాఖా మంత్రి, బీజేపీ కీలక నేత అరుణ్ జైట్లీ శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి నివాళి అర్పించే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కుమారుడు, బీజేపీ నేత విజయేంద్ర అత్యుత్సాహంతో పప్పులో కాలేశారు. వెంటనే సర్దుకున్న విజయేంద్ర సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆ వ్యాఖ్యలు డిలీట్ చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కుమారుడు విజయేంద్ర కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. తాను మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పుడు అరుణ్ జైట్లీ కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ గా ఉన్నారని విజయేంద్ర పోస్టు చేశారు.
అరుణ్ జైట్లీ లేని లోటు దేశానికి, బీజేపీకి, వ్యక్తిగతంగా తనకు ఎంతో తీరనిలోటు అని విజయేంద్ర సోషల్ మీడియాలో వివరించారు. విజయేంద్ర సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యాఖ్యలు చూసిన నెటిజన్లు ముక్కున వేలు వేసుకున్నారు. విజయేంద్ర కర్ణాటక ముఖ్యమంత్రి ఎప్పుడు అయ్యారు ? అని సోషల్ మీడియాలో చర్చ ప్రారంభించారు.
కొందరు అయితే విజయేంద్రకు సోషల్ మీడియాలో చరుకలు అంటించారు. విషయం గుర్తించిన విజయేంద్ర వెంటనే ఆ వ్యాఖ్యలు డిలీట్ చేశారు. అనంతరం సీఎం యడియూరప్ప కుమారుడు విజయేంద్ర కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు.
విద్యార్థి సంఘం నాయకుడిగా, న్యాయవాదిగా, గొప్ప రాజకీయ నాయకుడిగా అరుణ్ జైట్లీ ఎనలేని సేవ చేశారని విజయేంద్ర వివరించారు. అటల్ బిహారి వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశారని, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన అరుణ్ జైట్లీ భారతదేశ ఆర్థిక రంగం రూపురేఖలు మార్చివేశారని విజయేంద్ర సోషల్ మీడియాలో పోస్టు చేశారు.