ఇంటెలిజెన్స్ రిపోర్టుతో షాక్ కు గురైన సీఎం, కుమారుడి విజయం కోసం, బీజేపీ నాయకులు!
బెంగళూరు: మండ్య లోక్ సభ ఎన్నికలకు సంబందించి ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక చూసిన కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి షాక్ కు గురైనారని సమాచారం. ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం మండ్య, మళవళ్ళి, మద్దూరు శాసన సభ నియోజక వర్గాల్లో జేడీఎస్ కు ఎదురు దెబ్బ తగిలిందని తెలిసింది.
ఇంటెలిజెన్స్ నివేదిక అందిన తరువాత ఆ మూడు నియోజక వర్గాల శాసన సభ్యులు శ్రీనివాస్, అన్నదాని, డి.సి. తమ్మణ్ణలను పిలిపించిన సీఎం కుమారస్వామి వారి మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారని సమాచారం. జేడీఎస్ కార్యకర్తలను ఎందుకు దూరం చేసుకున్నారని కుమారస్వామి ప్రశ్నించారని తెలిసింది.
మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేశారు. మండ్య లోక్ సభ నియోజక వర్గంలో తన కుమారుడు నిఖిల్ కుమారస్వామిని గెలిపించుకోవడానికి సీఎం కుమారస్వామి శక్తి వంచన లేకుండా పని చేశారు.
బెంగళూరులోని మల్లేశ్వరంలో జరిగిన బీజేపీ నాయకుల సమావేశంలో మండ్య జిల్లా బీజేపీ శాఖ అధ్యక్షుడు నాగనగౌడ ఎన్నికల నివేదిక సమర్పించారు. బీజేపీ మద్దతు ఇచ్చిన స్వతంత్ర పార్టీ అభ్యర్థి సుమలత కచ్చితంగా 45 వేల మెజారిటీతో విజయం సాదిస్తారని నాగనగౌడ నివేదిక ఇచ్చారని వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న కుమారస్వామి అయోమయంలో పడిపోయారని తెలిసింది.