బెంగళూరులో పరిశ్రమల స్థాపనకు బ్రేక్, సీఎం కుమారస్వామి, వేరే ప్రాంతాలు, ఇబ్బంది!
బెంగళూరు: బెంగళూరు నగరంలో ఇక ముందు ఫ్యాక్టరీలు, పరిశ్రమలు ఇష్టం వచ్చినట్లు స్థాపించకుండా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. బెంగళూరు ప్రజలు అనేక ఇబ్బందులకు గురి కాకుండా చూసుకుంటామని సీఎం కుమారస్వామి హామీ ఇచ్చారు.
బుధవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన సీఎం కుమారస్వామి బెంగళూరు నగరంలో విచ్చలవిడిగా ఏర్పాటు అవుతున్న పరిశ్రమలు, ఫ్యాక్టరీలతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
బెంగళూరు నగర శివార్లలో, గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు, పరిశ్రమలు ఏర్పాటు చేయించడానికి చర్యలు తీసుకుంటామని కుమారస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండవ కేటగిరి నగరాల్లో ఫ్యాక్టరీలు, పరిశ్రమలు ఏర్పాటు చెయ్యడానికి పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పిస్తామని సీఎం కుమారస్వామి అన్నారు.
కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో చిన్నచిన్న సమస్యలు ఉన్నాయని, వాటిపై ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నాయకులు భూతద్దంలో చూపిస్తూ విమర్శలు చేస్తున్నారని సీఎం కుమారస్వామి అసహనం వ్యక్తం చేశారు.
కర్ణాటకలో ఐదు సంవత్సరాలు పూర్తిగా జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందని సీఎం కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. జాతీయ బ్యాంకుల్లో రైతుల రుణాలు మాఫీ చేశామని, బ్యాంకుల యాజమాన్యం నాలుగు సంవత్సరాలు డబ్బు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, వచ్చే జులైలో బ్యాంకులకు నిధులు విడుదల చేస్తామని సీఎం కుమారస్వామీ హామీ ఇచ్చారు.
జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలని మాజీ సీఎం సిద్దరామయ్య ప్రయత్నించడం లేదని సీఎం కుమారస్వామి అన్నారు. సిద్దరామయ్య వలనే కర్ణాటకలో సెక్యూలర్ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు. ఎవరైన సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తే మాజీ సీఎం సిద్దరామయ్య అందుకు అవకాశం ఇవ్వరని సీఎం కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు.