కొడుగు వరదలు రూ. 3 వేల కోట్లు నష్టం, రూ. 2 వేల కోట్లు ఇవ్వండి, ప్రధానికి సీఎం లేఖ!
బెంగళూరు: కొడుగులో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా భూమి కుంగిపోయి అనేక ఇండ్లు నేల మట్టం అయ్యాయని, రహదారులు, వంతెనలు పూర్తిగా ద్వంసం అయ్యాయని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మీడియాకు చెప్పారు.
కొడుగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో రూ. 3,000 కోట్లకు పైగా నష్టం జరిగిందని అంచనా వేశామని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి వెంటనే రూ. 2,000 కోట్లు సహాయం చెయ్యాలని కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశానని ముఖ్యమంత్రి కుమారస్వామి మీడియాతో అన్నారు.
కొడుగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో జరిగిన నష్టం గురించి పూర్తి సమాచారంతో ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి, హోం శాఖ మంత్రికి లేఖలు రాశామని ముఖ్యమంత్రి కుమారస్వామి వివరించారు. వరద బాధితులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధికి ఇప్పటి వరకు రూ. 25.16 కోట్ల నిధులు వచ్చాయని సీఎం హెచ్.డి. కుమారస్వామి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి జీతాల నుంచి రూ. 102 కోట్లు సీఎం సహాయనిధికి ఇచ్చారని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొడుగులోని వరద బాధితుల పునరావాస కేంద్రాలను పరిశీలించారు.
తన ఎంపీ నిధుల కింద రూ. 1 కోటి విడుదల చేస్తున్నామని నిర్మలా సీతారామన్ మీడియాకు చెప్పారు. సహాయక చర్యలకు రక్షణ శాఖ నుంచి రూ. 7 కోట్లు నిధులు వెంటనే మంజూరు చేస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు చెప్పారు.