సీఎం కుమారస్వామి తుగ్లక్ దర్బార్, అధికారం ఉందని వీడియో డిలీట్, మాజీ సీఎం ఫైర్ !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి తుగ్లర్ దర్బార్ తో బిజీగా ఉన్నారని మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్. యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో తప్పు జరిగిందని తెలిసినా సీఎం కుమారస్వామి, ఆయన సోదరుడు హెచ్.డి. రేవణ్ణ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని బీఎస్. యడ్యూరప్ప మండిపడ్డారు.
హాసన్ లో వీడియో డిలీట్ చేసిన విషయంలో మాట్లాడిన మాజీ సీఎం యడ్యూరప్ప సీఎం కుమారస్వామి తీరుతో మండిపడ్డారు. అధికార దుర్వినియోగంతో తాము మాట్లాడిందే వేదం, తామే చేసిందే రైట్ అంటూ సీఎం కుమారస్వామి ప్రవర్థిస్తున్నారని ఆరోపించారు.
అధికార దుర్వినియోగంతో వీడియో డిలిట్ చేశారని, విచారణలో ఆ విషయం వెలుగు చూస్తుందని, దర్యాప్తు తరువాత కాలమే సమాధానం ఇస్తుందని మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప అన్నారు. అప్పుడు ప్రజలకు వీరు ఏం సమాధానం చెబుతారో వింటామని, అంతవరకు వేచి చూస్తామని మాజీ సీఎం యడ్యూరప్ప చెప్పారు.
అంతకు ముందు చించోళి శాసన సభ నియోజక వర్గంలోని ప్రముఖ దేవాలయాల్లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ అవినాష్ జాదెవ్ విజయం సాధించాలని బీఎస్. యడ్యూరప్ప ప్రత్యేక పూజలు నిర్వహించారు. చించోళి ఉప ఎన్నికల్లో డాక్టర్ అవినాష్ జాదవ్ 25 వేల మెజారిటీతో భారీ విజయం సాధిస్తారని బీఎస్. యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు.
డాక్టర్ ఉమేష్ జాదవ్ కాంగ్రెస్ కు మోసం చేసి బీజేపీలో చేరారని అంటున్నారని గుర్తు చేశారు. మాజీ సీఎం వీరేంద్ర పాటిల్ ను కాంగ్రెస్ పార్టీ అవమానించలేదా అని యడ్యూరప్ప ప్రశ్నించారు. మాజీ సీఎం వీరేంద్ర పాటిల్ తో విమానాశ్రయంలోనే రాజీనామా లేఖ తీసుకుని తీవ్రస్థాయిలో అవమానించారని యడ్యూరప్ప ఆరోపించారు.
రాజీనామా చేసిన తరవాత వీరేంద్ర పాటిల్ వెంట ఒక్కరుకూడా లేరని యడ్యూరప్ప గుర్తు చేశారు. మల్లికార్జున్ ఖార్గేకి ఇవి చివరికి ఎన్నికలని, డాక్టర్ ఉమేష్ జాదవ్ లోక్ సభ ఎన్నికల్లో, ఆయన కుమారుడు డాక్టర్ అవినాష్ జాదెవ్ శాసన సభ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తారని యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు.