సంకీర్ణ ప్రభుత్వం, బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముహుర్తం ఫిక్స్, కాంగ్రెస్, జేడీఎస్, రైతుల రుణం !
బెంగళూరు: కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రంగం సిద్దం చేస్తోంది. ఆర్థిక శాఖ ఎవరు తీసుకోవాలి అంటూ కొన్ని రోజులుగా చర్చలు జరిగాయి. ఆర్థిక శాఖను జేడీఎస్ కు ఇవ్వడానికి కాంగ్రెస్ నాయకులు సిద్దం అయ్యారు అని వెలుగు చూసిన సమయంలోనే కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముహుర్తం నిర్ణయించింది.
సీఎం కుమారస్వామి
ఆర్థిక శాఖ కేటాయింపు విషయంలో చర్చలు ఓ కొలిక్కి వచ్చిన సందర్బంగా సీఎం కుమారస్వామి ఉభయ సభల సమావేశం నిర్వహించడానికి సిద్దం అయ్యారని తెలిసింది. కర్ణాటకలోని కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం బడ్జెట్ ఎలా ప్రవేశపెడుతుందో అని ఇప్పుడు చర్చ మొదలైయ్యింది.
సిద్దరామయ్య
సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశ పెట్టింది. సిద్దరామయ్య నేతృత్వంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని ప్రముఖ పథకాలు కొనసాగించి కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మళ్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి సిద్దం అయ్యింది.
2018-19 బడ్జెట్
2018-19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ తయారు చెయ్యాలని మంగళవారం సీఎం కుమారస్వామి సంబంధిత అధికారులకు సూచించారని సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని ప్రముఖ పథకాలు జూన్ లో ప్రవేశ పెట్టే బడ్జెట్ లో పొందుపరుస్తారని సమాచారం.
రెండు పార్టీల మేనిఫెస్టో
కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టోలోని ప్రముఖ అంశాలు పరిగణలోకి తీసుకుని బడ్జెట్ తయారు చెయ్యాలని ఇరు పార్టీల నాయకులు నిర్ణయించారని తెలిసింది. ముఖ్యంగా రైతుల రుణమాఫీ, కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టి ప్రజల ఆదరణపొందిన పథకాలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.