సీఎంతో చర్చలు, అసంతృప్తి ఎమ్మెల్యేల రాజీనామాలపై క్లారిటీ, హైకమాండ్, సిద్దూకు చెప్పాం!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యి సుధీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి ఎమ్మెల్యేలు రమేష్ జారకిహోళి (మాజీ మంత్రి), మహేష్ కుమటళ్ళి, బి. నాంగ్రేంద్రతో ముఖ్యమంత్రి కుమారస్వామి చర్చలు జరిపారు. ఇప్పటికే హైకమాంద్ తో పాటు సిద్దూకు మా సమస్యలు గురించి చెప్పామని అసంతృప్తి ఎమ్మెల్యేలు అంటున్నారు.
రాజీనామాలకు ఎమ్మెల్యేలు క్యూ, బాంబు పేల్చిన బళ్లారి శ్రీరాములు, సంకీర్ణ ప్రభుత్వానికి షాక్, బీజేపీ!
బెంగళూరులోని రమేష్ జారకిహోళి ఇంటికి సీఎం కుమారస్వామి స్వయంగా వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. సొంత పార్టీ నాయకుల తీరుపై తాము రగిలిపోతున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
హైకమాండ్ కు చెప్పాం !
అసంతృప్తి ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేష్ జారకిహోళి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై తాము అసహనంతో ఉన్నామని అన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు సమాచారం ఇచ్చామని, ఢిల్లీ పెద్దలు ఇంత వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, వారి సమాధానం కోసం వేచి చూస్తున్నామని అన్నారు. అయితే తాము కాంగ్రెస్ పార్టీని వదిలి వేరే పార్టీలో (బీజేపీ) చేరమని రమేష్ జారకిహోళి చెప్పారు.
సోదరుడి ఇష్టం
బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బి. నాగేంద్ర మాట్లాడుతూ తన సోదరుడు వెంకటేష్ ప్రసాద్ బీజేపీ టిక్కెట్ తో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తాడనే సమాచారం తనకు తెలీదని అన్నారు. అయితే తన సోదరుడు వెంకటేష్ ప్రసాద్ నిర్ణయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అది ఆయన ఇష్టం అని, తాను మాత్రం బీజేపీలో చేరనని కాంగ్రెస్ అసంతృప్తి ఎమ్మెల్యే బి. నాగేంద్ర తెలిపారు.
అధిక నిధులు ఇస్తాం
కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై తాము అసహనంతో ఉన్నామని, అందరి మీద తమకు అసంతృప్తి లేదని ఎమ్మెల్యేలు అంటున్నారు. సీఎం కుమారస్వామితో తాము సుదీర్ఘంగా చర్చలు జరిపామని వారు వివరించాయి . బెళగావి, బళ్లారి జిల్లాల సమస్యలు పరిష్కరించి అభివృద్ది పనులకు వెంటనే స్పంధిస్తామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. తమ సమస్యలు పరిష్కరిస్తారని సీఎం కుమారస్వామి మీద తమకు నమ్మకం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు.
సిద్దరామయ్యకు చెప్పాం
కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో అసమ్మతి ఎమ్మెల్యే మహేష్ కుమటళ్లి మాట్లాడుతూ తాము కాంగ్రెస్ పార్టీని వదిలి వేరే పార్టీలో చేరమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో తాము ఇప్పటికే మా సమస్యల గురించి చెప్పామని, ఇప్పుడు ముఖ్యమంత్రి కుమారస్వామికి మా సమస్యల గురించి వివరించామని మహేష్ కుమటళ్లి చెప్పారు.
సంకీర్ణ ప్రభుత్వానికి గుబులు !
కొంత కాలంగా సొంత పార్టీ నాయకుల తీరుపై రగిలిపోతున్న ఎమ్మెల్యే డాక్టర్ ఉమేష్ జాదవ్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యడంతో ఆ పార్టీ నాయకులు హడలిపోయారు. మిగిలిన అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎక్కడ రాజీనామా చేస్తారో అనే ఆందోళనతో సీఎం కుమారస్వామి స్వయంగా రంగంలోకి దిగారు. అయితే డాక్టర్ ఉమేష్ జాదెవ్ దారిలో తాము ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చెయ్యమని అసంతృప్తి ఎమ్మెల్యేలు అంటున్నారు. సీఎం కుమారస్వామి మీద మాకు నమ్మకం ఉందని, కొంతకాలం వేచి చూస్తామని వారు అన్నారు.