చరిత్ర సృష్టించిన సీఎం కుమారస్వామి, భార్య అనితాతో కలిసి అసెంబ్లీకి, ఆక్షణాలు!
Recommended Video
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి చరిత్ర సృష్టించడానికి సిద్దం అయ్యారు. కర్ణాటక చరిత్రలోనే భార్యతో కలిసి శాసన సభలో అడుగుపెడుతున్న మొదటి ముఖ్యమంత్రిగా హెచ్.డి. కుమారస్వామి రికార్డు సృష్టిస్తున్నారని, ఆ క్షణాలను చూడటానికి ఎదురు చూస్తున్నామని జేడీఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు.
2018 నంబర్ 3వ తేదీ రామనగర శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన అనితా కుమారస్వామి బీజేపీ అభ్యర్థి ఎల్. రామచంద్ర మీద 1. 09 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు.
గతంలో రామనగర శాసన సభ నియోజక వర్గం నుంచి హెచ్.డి. కుమారస్వామి, మధుగిరి శాసన సభ నియోజక వర్గం నుంచి అనితా కుమారస్వామి ఎమ్మెల్యేలు అయ్యారు. అప్పట్లో ఇద్దరూ కర్ణాటక అసెంబ్లీకి కలిసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ సమయంలో కుమారస్వామి సీఎంగా లేరు.
ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఎమ్మెల్యే అయిన తన సతీమణి అనితా కుమారస్వామితో కలిసి అసెంబ్లీలో అడుగుపెట్టే అపురూప క్షణాలు చూడటానికి తాము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యే కే. గోపాలయ్య తదితరులు మీడియాతో అన్నారు.
2018 జరిగిన శాసన సభ ఎన్నికల్లో హెచ్.డి. కుమారస్వామి రామనగర, చెన్నపట్టణ శాసన సభ నియోజక వర్గాల నుంచి పోటీ చేశారు. రెండు నియోజక వర్గాల్లో విజయం సాధించిన కుమారస్వామి అనంతరం రామనగర నియోజక వర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సీఎం కుమారస్వామి రాజీనామా చెయ్యడంతో ఆయన సతీమణి అనితా కుమారస్వామి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.