కేరళలో భారీ వర్షాలు, రూ. 10 కోట్ల ఆహార పదార్థాలు, వైద్య సహాయం కర్ణాటక సీఎం!
Recommended Video
బెంగళూరు: కేరళలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోందని, బాధితులను ఆదుకోవడానికి తాము సిద్దంగా ఉన్నామని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. రూ. 10 కోట్లు విలువైన ఆహారపదార్థాలు, దుస్తులు, దుప్పట్లు, అవసరమైన నిత్యవసర వస్తువులు కేరళకు పంపిస్తామని శుక్రవారం హెచ్.డి. కుమారస్వామి మీడియాకు చెప్పారు.
సీఎం కుమార ఆదేశాలు
కేరళలో భారీ వర్షాల కారణంగా స్థానికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడానికి అవసరమైన ఆహారం, ఇతర నిత్యవసర వస్తువులు సరఫరా చెయ్యడానికి చర్యలు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీఎం. విజయభాస్కర్ కు ఆదేశాలు జారీ చేశారు.
ప్రత్యేక వైద్య బృందాలు
కేరళలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నారు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ సందర్బంలో కేరళలో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడానికి, అంటు వ్యాదులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి, వైద్య చికిత్సలు అందించడానికి కర్ణాటక నుంచి ప్రత్యేక వైద్యుల బృందాలను పంపిస్తున్నామని సీఎం. హెచ్. డికుమారస్వామి మీడియాకు చెప్పారు.
75 వేల క్యూసెక్కుల నీరు
కేరళలో భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదురుకావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మనవి మేరకు కబిని జలాశయం నుంచి 75, 000 క్యూసెక్కుల తాగు నీటిని విడుదల చేస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు.
కేరళ సీఎంతో చర్చలు
కేరళలో భారీ వర్షాలు, వరదల విషయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పిణరయి విజయన్ తో తాను మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నానని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. కేరళ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఆదుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం హెచ్.డి. కుమారస్వామి మీడియాకు చెప్పారు.
జనజీవనం
కేరళలోని మల్లప్పురం, కణ్ణూరు, వయనవాడి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. కేరళ ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడి ప్రజలను ఆదుకోవడానికి సిద్దం అవుతున్నాయి.