కర్ణాటక సీఎం vsడీజీపీ, ఆరోజు మమత బెనర్జీ, నేడు సీఎం తల్లి, ఏం చేస్తున్నారు, నివేదిక!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి పోలీసు శాఖ మీద ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా లోపాలు, ప్రముఖులు వచ్చే సమయంలో ట్రాఫిక్ జామ్ లు ఏమిటని, నివేదిక ఇవ్వాలని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి డీజీపీ నీలమణి రాజుకు ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు మమతా బెనర్జీ కారణంగా, నేడు సీఎం తల్లి కారణంగా డీజీపీకి ప్రభుత్వం అక్షింతలు వేసింది.
సీఎం సీరియస్
బుధవారం రాజ్ భవన్ లో కర్ణాటక మంత్రివర్గం విస్తరణ సమయంలో భద్రతా ఏర్పాట్లలో పోలీసు అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని, పలువురు ప్రముఖులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపణలు రావడంతో సీఎం కుమారస్వామి సీరియస్ అయ్యారు.
డీజీపీ, కమిషనర్
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి గురువారం డీజీపీ నీలమణి రాజు, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ టి. సునీల్ కుమార్ తో పాటు బెంగళూరుకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు, ట్రాఫిక్ విభాగం పోలీసు అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చివాట్లు పెట్టారని తెలిసింది.
సీఎం తల్లికి కష్టాలు
బుధవారం రాజ్ భవన్ లో సీఎం కుమారస్వామి సోదరుడు రేవణ్ణ ప్రమాణస్వీకారం చేశారు. రేవణ్ణ ప్రమాణస్వీకారానికి మాజీ ప్రధాని దేవేగౌడ సతీమణి, సీఎం కుమారస్వామి తల్లి చెన్నమ్మ వెళ్లారు. ట్రాఫిక్ ఇబ్బందులతో రాజ్ భవన్ రోడ్డు మార్గంలో కారు దిగిన చెన్నమ్మ నడుచుకుంటూ రాజ్ భవన్ లోకి ప్రవేశించారు.
పోలీసుల వైఫల్యం
స్పీకర్ రమేష్ కుమార్ ను రాజ్ భవన్ లోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయంపై స్పీకర్ రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభకు ఘాటుగా లేఖ రాశారు. ఎమ్మెల్సీ శరవణ నానా ఇబ్బందులు పడి చివరికి రాజ్ భవన్ చేరుకున్నారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే శరవణ సీఎం కుమారస్వామికి ఫిర్యాదు చేశారు
మీరు ఏం చేస్తున్నారు
రాజ్ భవన్ దగ్గర భద్రతా ఏర్పాట్లు చెయ్యడంలో ఎందుకు విఫలం అయ్యారు, ట్రాఫిక్ నియంత్రిచడంలో ఎందుకు విఫలం అయ్యారు అంటూ డీజీపీ నీలమణి రాజు, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ టి. సునీల్ కుమార్ మీద సీఎం కుమారస్వామి మండిపడ్డారని తెలిసింది.
ఆరోజు ఈరోజు డీజీపీ
రాజ్ భవన్ దగ్గర భద్రతా వైఫల్యాలపై నివేదిక ఇవ్వాలని డీజీపీ నీలమణి రాజుకు సీఎం కుమారస్వామి ఆదేశాలు జారీ చేశారు. కుమారస్వామి ప్రమాణస్వీకారం రోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్రాఫిక్ లో చిక్కుకుని విధాన సౌధకు నడుచుకుని వచ్చి అందరి ముందు డీజీపీ నీలమణి రాజు మీద మండిపడిన విషయం తెలిసిందే.