కర్ణాటక ప్రభుత్వానికి సినిమా చూపిస్తున్నాడు, ఇంటికి సీఎం, మంత్రులు క్యూ, నేను వినను అంతే !
బెంగళూరు: జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇరు పార్టీల నాయకులకు సినిమా చూపిస్తున్నారు. సీఎంతో సహ ఎంతో మంది సీనియర్ నాయకులు, మంత్రులు వెళ్లి మాజీ మంత్రి ఎంబి. పాటిల్ కు నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా ఆయన ఒక్క మెట్టుదిగలేదు.
శుక్రవారం బెంగళూరు నగరంలోని సదాశివనగర్ లోని మాజీ మంత్రి ఎంబి. పాటిల్ ఇంటికి కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి స్వయంగా వెళ్లారు. ఎంబి. పాటిల్ తో చాలాసేపు మాట్లాడిన సీఎం కుమారస్వామి అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఎంబి. పాటిల్ కుటుంబ సభ్యులకు తనకు ఎంత కాలం నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సీఎం కుమారస్వామి అన్నారు. ఎంబి. పాటిల్ కు మంత్రి పదవి రాలేదని అసమ్మతి వ్యక్తం చేశారని, దానిని సరిచెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో తాను మాట్లాడుతానని సీఎం కుమారస్వామి అన్నారు.
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు హైకమాండ్ తో మాట్లాడితే అన్ని సర్దుకుంటాయని సీఎం కుమారస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంబి. పాటిల్ ఇంటికి శుక్రవారం సీఎం కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్, మంత్రులు డీకే. శివకుమార్, ఆర్.వీ. దేశ్ పాండే, కేజే. జార్జ్ తదితరులు వెళ్లి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అయితే మాజీ మంత్రి ఎంబి. పాటిల్ మాత్రం ఎవ్వరిమాట వినకుండా పట్టినపట్టు వదలడం లేదు.