నేను తప్పు చేశాను, జీవితంలో ఇలా జరగకుండా చూసుకుంటా: సీఎం విచారం !
బెంగళూరు: తాను ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న కార్మికుల మీద మండిపడి చాల తప్పు చేశానని, జీవితంలో ఇలా జరగకుండా చూసుకుంటానని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి విచారణం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం రాయచూరు జిల్లాలోని కరెగుడ్డ గ్రామం సమీపంలో ప్రయాణిస్తున్న సీఎం కుమారస్వామి వాహనాన్ని కార్మికులు అడ్డగించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన విషయం తెలిసిందే.
సీఎం కుమారస్వామి ప్రయాణిస్తున్న బస్సును అడ్డగించిన కార్మికులు ధర్నా నిర్వహించారు. ఆ సమయంలో సహనం కొల్పోయిన సీఎం కుమారస్వామి కార్మికులపై విరుచుకుపడ్డారు. ఓటు మాత్రం నరేంద్ర మోడీకి వేస్తారు, సమస్యలు మాత్రం నన్ను పరిష్కరించాలని నిలదీస్తారా అంటూ మండిపడ్డారు.
మర్యాదగా వాహనానికి దారి ఇస్తారా లేదంటే పోలీసులతో లాఠీచార్జ్ చేయించమంటారా అంటూ సీఎం కుమారస్వామి ఆవేశంతో ఊగిపోయారు. అనంతరం సీఎం కుమారస్వామి తీరుపై ప్రతిపక్షాలు మండిపడ్డారు. ఒక సీఎం పదవిలో ఉన్న కుమారస్వామి ప్రజలతో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి.
తన తప్పు తెలుసుకున్న సీఎం కుమారస్వామి కార్మికులు తనకు వ్యతిరేకంగా ధర్నా చేసి నినాదాలు చేసిన సమయంలో తాను సహనం కొల్పోయి తప్పు చేశానని విచారం వ్యక్తం చేశారు. ఇక ముందు ఇలా జరగకుండా చూసుకుంటానని, కార్మికులు తనను క్షమించాలని సీఎం కుమారస్వామి మనవి చేశారు.
సీఎం కుమారస్వామి కార్మికుల మీద మండిపడుతున్న తతంగం మొత్తం మీడియాలో ప్రసారం కావడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. చిరికి తన తప్పు తెలుసుకున్న ముఖ్యమంత్రి కుమారస్వామి కార్మికులు, రాయచూరు జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పి ఆ వివాదానికి తెర వెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు.