ప్రజల్లో నన్ను విలన్ ను చేశారు, ప్రధాని మోడీని మాత్రం, కర్ణాటక సీఎం కుమారస్వామి ఫైర్ !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి మీడియా మీద విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీని ఒక రకంగా, తనను ఒక రకంగా చూస్తున్నారని, కర్ణాటక ప్రజల్లో తనను విలన్ చేస్తున్నారని, ఇదేనా మీ తీరు అంటూ ముఖ్యమంత్రి హెచ్. డి. కుమారస్వామి మండిపడ్డారు.
శనివారం బెంగళూరులో సీఎం హెచ్.డి. కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా మీడియా తనను ప్రజల్లో విలన్ గా నిలబెడుతోందని సీఎం. హెచ్.డి. కుమారస్వామి ఆరోపించారు. కర్ణాటకలో ఉన్న జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని సీఎం కుమారస్వామి చెప్పారు.
కర్ణాటకలో పెట్రోల్, డీజల్ మీద అధిక పన్ను ఎందుకు వేశారు అని మీడియా ప్రశ్నించిన సమయంలో సీఎం హెచ్.డి. కుమారస్వామి అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పెట్రోల్ మీద రూ. 20 పెంచిన సమయంలో మీడియా మౌనంగా ఉందని సీఎం కుమారస్వామి ఆరోపించారు.
దేశ వ్యాప్తంగా గ్యాస్ సిలిండ్ మీద ఇప్పటి వరకూ రూ. 300 పెంచితే అప్పుడు మీడియా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని, రెండు నెలలు కూడా పూర్తి కాని కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నిస్తోందని సీఎం హెచ్.డి. కుమారస్వామి అసహనం వ్యక్తం చేశారు.