'సీఎం సిద్ధరామయ్య వాచీ దొంగిలించిందేమో'
బెంగళూరు: కర్నాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గడియారం విషయమై రగడ కొనసాగుతోంది. అది తన స్నేహితుడు ఇచ్చాడని సిద్ధరామయ్య రెండు రోజుల క్రితం చెప్పారు. దీనిపై జెడిఎస్ అధ్యక్షులు కుమారస్వామి తనశైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సిద్ధరామయ్య చేతి గడియారం చోరీ సొత్తనే అనుమానం కలుగుతోందని, దానిపై సిబిఐతో విచారణ జరిపించాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. బీదర్లో నేను గడియారం ఫొటోలను విడుదల చేసిన అనంతరం ఓ మిత్రుడు ఫొన్ చేశారని, ఇలాంటి గడియారాలు తనకు తెలిసిన వైద్యుడు సుధాకర శెట్టి ఇంట్లో చోరీకి గురయ్యాయని చెప్పాడన్నారు.
నేను బీదర్ నుంచి తిరిగొచ్చాక తనను కలుస్తానన్న శెట్టి కలవలేదని, ఆయన మనసును ఎవరో మార్చేశారని, శెట్టి నిరుడు మే 7న తన ఇంట్లో గడియారం పోయిందని ఫిర్యాదు చేశారన్నారు. ఈ కేసుపై సంబంధిత డిప్యూటి పోలీస్ కమిషనరే సమాధానం చెప్పాలన్నారు.
శెట్టికి ఫోన్ చేసి నిజాన్ని వెల్లడించేందుకు అధైర్యపడకండని చెబితే.. దానికి ఆయన ఈ వయస్సులో అదంతా నాకెందుకు అన్నారని, మరోవైపు సీఎం... గిరీశ్ చంద్రవర్మ ఆత్మీయుడు తనకు కానుకిచ్చారని అని చెబుతున్నారని, ఆత్మీయులకు ఎవరైనా పాత వస్తువుల్ని కానుకగా ఇస్తారా? ముందేమో వకీలు ఇచ్చారనీ, తర్వాత వైద్యుడు ఇచ్చారని చెబూతూ వరుసగా అబద్ధాలు ఆడుతున్నారని కుమారస్వామి మండిపడ్డారు.
కుమార స్వామి ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఆ వాచీ తనకు స్నేహితుడు ఇచ్చిందేనని, దొంగ సొత్తుకాదన్నారు.