బళ్లారి శ్రీరాములు సన్నిహితుడికి ఐటీ శాఖ షాక్, దాడులు, బీజేపీ డ్రామాలు, సీఎం సిద్దూ, జీవితంలో!
బెంగళూరు: బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములు మద్దతుదారుడి ఇంటిలో బుధవారం ఉదయం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. బీజేపీ ఎంపీ శ్రీరాములు మద్దతుదారుల ఇళ్లలో ఐటీ సోదాల విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మైసూరులో స్పంధించారు. పక్కాప్లాన్ తో కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని సీఎం సిద్దరామయ్య విమర్శించారు.
Recommended Video
కాంగ్రెస్ పార్టీ మీద కక్ష
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్షకట్టి నిత్యం ఆదాయపన్ను శాఖ అధికారులతో దాడులు చేయిస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. ఈ విషయంపై ప్రజల దృష్టి మళ్లించడానికి శ్రీరాములు అనుచరుల మీద ఐటీ సోదాలు చేయించారని సీఎం సిద్దరామయ్య విమర్శించారు.
12 సార్లు ఎన్నికలు చూశాను
12 సార్లు తాను లోక్ సభ, శాసన సభ ఎన్నికలు ప్రత్యక్షంగా చూశానని, ఏ ఎన్నికల్లో ఇలాంటి ఐటీ సోదాలు జరగలేదని సీఎం సిద్దరామయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బసచేసిన గదుల్లోనే ఎక్కవ ఐటీ సోదాలు జరిగాయని, బీజేపీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని సీఎం సిద్దరామయ్య చెప్పారు. ఇటీవల బాదామిలో సీఎం సిద్దరామయ్య సన్నిహితుడు, ఎమ్మెల్సీ సీఎం. ఇబ్రహీం బసచేసిన రిసార్టులో ఐటీ సోదాలు చేసిన విషయం తెలిసిందే.
బెంగళూరు నకిలీ ఓటర్లు
బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర (ఆర్ఆర్ నగర)లో నకిలీ ఓటరు ఐడీ కార్డుల విషయంపై మాట్లాడిన సీఎం సిద్దరామయ్య ఈ విషయంపై తనకు పూర్తి సమాచారం లేదని, ఎన్నికల అధికారులు విచారణ చేస్తున్నారని, పూర్తి సమాచారం తెలుసుకున్న తరువాత మాట్లాడుతానని చెప్పారు.
ఎన్నికలు వాయిదా ఎందుకు!
ఆర్ఆర్ నగర్ లో చిక్కన నకిలీ ఓటర్లు ఐడీ కార్డులపై కేంద్ర మంత్రి అనంత్ కుమార్ చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని, కేంద్రంలో వాళ్లే (బీజేపీ) అధికారంలో ఉన్నారని, విచారణ జరిపించుకోవాలని సీఎం సిద్దరామయ్య అన్నారు. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారని, అందులో ఎలాంటి అర్థం లేదని సీఎం సిద్దరామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.
హీరో సుదీప్ ప్రచారం
బహుబాష నటుడు, రాజమౌళి ఈగ ఫేం కిచ్చ సుదీప్ చాముండేశ్వరి నియోజక వర్గంలో ఎందుకు ప్రచారం చెయ్యలేదని మీడియా సిద్దరామయ్యను ప్రశ్నించింది. సుదీప్ ప్రచారానికి వస్తానని తనకు కూడా చెప్పారని, చివరి నిమిషంలో ఆయనకు అత్యవసర పనులు ఉండటంతో రాలేకపోయారని సీఎం సిద్దరామయ్య సమాధానం ఇచ్చారు.