సీఎం సిద్దరామ్య, బళ్లారి ఎంపీ శ్రీరాములు బిగ్ ఫైట్: బాదామిలో గాలి జనార్దన్ రెడ్డి ఎంట్రీ !
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు రెండు శాసన సభ నియోజక వర్గాల్లో ఎవరు విజయం సాధిస్తారు అంటూ తీవ్రస్థాయిలో చర్చ మొదలైయ్యింది. 224 శాసన సభ నియోజక వర్గాల్లో మైసూరు జిల్లా చాముండేశ్వరి నియోజక వర్గం, ఉత్తర కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లాలోని బాదామి నియోజక వర్గం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాఫిక్ అయ్యాయి. చాముండేశ్వరి, బాదామి నియోజక వర్గంలో విజయం సాధించడం ఇప్పుడు సీఎం సిద్దరామయ్యకు అగ్నిపరీక్షగా మారింంది.
Recommended Video
సీఎంకు చాలెంజ్
మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నియోజక వర్గం నుంచి సీఎం సిద్దరామయ్య పోటీ చేస్తున్నారు. సీఎం సిద్దరామయ్యకు సిట్టింగ్ ఎమ్మెల్యే జీటి. దేవేగౌడ గట్టిపోటీ ఇస్తున్నారు. చాముండేశ్వరి నియోజక వర్గంలో సిద్దరామయ్య ఓడిపోతారని ఇంటిలిజెన్స్ వర్గాలు నివేధిక ఇచ్చారని వార్తలు వచ్చినా వాటిని కాంగ్రెస్ వర్గాలు ఖండించాయి.
సీఎంతో బళ్లారి ఎంపీ ఢీ
బాగల్ కోటే జిల్లాలోని బాదామి నియోజక వర్గం నుంచి సీఎం సిద్దరామయ్య పోటీ చేస్తున్నారు. బాదామి నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్యకు బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములు పోటీగా నిలిచారు. బాదామి నియోజక వర్గంలో సిద్దరామయ్య, శ్రీరాములు నువ్వానేనా అంటూ పోటీ పడుతున్నారు.
నాయకుల ధీమా
బాదామి నియోజక వర్గంలో మంగళవారం నామినేషన్ వేసిన సీఎం సిద్దరామయ్య, శ్రీరాములు ప్రచారం ముమ్మరం చేశారు. బాదామిలో జరిగే ఎన్నికల యుద్ధంలో విజయం నాదే అని శ్రీరాములు చెప్పారు. ఉత్తర కర్ణాటక ప్రజలు ఒత్తిడి చెయ్యడం వలనే తాను బాదామిలో పోటీ చేస్తున్నానని, కచ్చితంగా గెలుస్తానని సీఎం సిద్దరామయ్య అన్నారు. సీఎం సిద్దరామయ్య రెండు చోట్ల ఓడిపోతారని మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప జోస్యం చెప్పారు.
సీఎంకు ప్లస్ పాయింట్స్
బాదామి నియోజక వర్గంలో సిద్దరామయ్య వర్గానికి చెందిన కురబ కులస్తుల ఓట్లు 48,000కు పైగా ఉన్నాయి. ఎస్సీల ఓట్లు 22,000, ముస్లీంల ఓట్లు 11,000 ఉన్నాయి. ఈ మొత్తం ఓట్లు సిద్దరామయ్యకు పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే టిక్కెట్ పంపిణి విషయంలో జరిగిన హై డ్రామాతో సీఎం సిద్దరామయ్యకు ఎన్ని ఓట్లు పడుతాయో అనే విషయం అంతుచిక్కడం లేదు.
శ్రీరాములుకు ప్లస్ పాయింట్స్
బాదామి నియోజక వర్గంలో వాల్మీకిల ఓట్లు దాదాపు 20 వేలు ఉన్నాయి. శ్రీరాములు వాల్మీకి కులానికి చెందిన వాడు కావడం, బాదామి నియోజక వర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీనే అధికారంలో ఉండటంతో ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే శ్రీరాములు రెండు నియోజక వర్గాల్లో పోటీ చేస్తుండటంతో ఒక వేళ ఆయన గెలిచినా మళ్లీ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఆయనకు ఒక మైనస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది.
గాలి జనార్దన్ రెడ్డి ఎంట్రీ
సీఎం సిద్దరామయ్యను గెలిపించే బాధ్యతను మాజీ మంత్రి సతీష్ జారకిహోళి తీసుకున్నారు. శ్రీరాములు తరపున మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద సీఎం సిద్దరామయ్యను ఓడించడానికి గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు అందరూ రంగంలోకి దిగారు.
మూడు నియోజక వర్గాలు
చాముండేశ్వరి, బాదామి, మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గాల్లో హోరాహోరి ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద చాముండేశ్వరి, బాదామి నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్యను ఓడించడానికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఎవరు ఎక్కడ విజయం సాధిస్తారు అనే విషయం మే 15వతేది తేలిపోతుంది.