లింగాయత, వీరశైవుల కన్నడ రాజకీయాలు, మఠాలు చుట్టుతున్న నేతలు, ఓటు బ్యాంకు !
బెంగళూరు: కర్ణాటకలో అత్యంత ప్రభావవంతమైన లింగాయత, వీరశైవుల కరుణ కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ముందుకు దూసుకువెలుతున్నారు. శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో లింగాయత, వీరశైవుల మఠాల చుట్టూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రదక్షిణలు చేస్తున్నారు.
బీజేపీ సొంతం
లింగాయత, వీరశైవుల ఓటు బ్యాంకుతో బలోపేతమైన చరిత్ర బీజేపీ సొంతం. శాసన సభ ఎన్నికలు సమీపించిన సమయంలో కర్ణాటక ప్రభుత్వం లింగాయతుల్ని మైనారిటీలుగా ప్రకటించింది. లింగాయత మైనారిటీ గుర్తింపు కోసం కేంద్రానికి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసింది.
కేంద్రానికి అగ్నిపరీక్ష
లింగాయతలను మైనారిటీలుగా గుర్తించకుంటే వారి ఓటు బ్యాంకు కోల్పోతామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. లింగాయత వర్గానికి చెందిన బీఎస్. యడ్యూరప్పను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. అయితే బీజేపీ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ముస్లీంల భయం
లింగాయతలను మైనారిటీలుగా ప్రకటించడాన్ని ముస్లీంలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ముస్లీంల విషయంలో కాంగ్రెస్ పార్టీ లోలోపల భయపడుతోంది. అయితే లింగాయతలను మైనారిటీలుగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తరువాతే ఆ సమస్య వస్తుందని, అంత వరకు ఎలాంటి భయం లేదని సీఎం సిద్దరామయ్య తన సన్నిహితులతో చెప్పారని తెలిసింది.
1,200 మఠాలు
లింగాయత మఠాలు కర్ణాటకలో 1,200కు పైగా ఉన్నాయి. మైసూరులోని సుత్తూరు మఠం 12వ దశాబ్దంలోని బసవేశ్వరుడి సమకాలీనంలో, తుమకూరులోని సిద్దగంగ మఠం 15వ దశాబ్దంలో, గదగ్ లోని తోంటదార్య మఠం 16వ దశాబ్దంలో స్థాపించారు. ఈ మూడు మఠాలధిపతుల అంతిమ నిర్ణయంతోనే లింగాయత ఓట్లు ఎటువైపు వెలుతాయో అని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.
ఆర్ఎస్ఎస్, అమిత్ షా
లింగాయతలను మైనారిటీలుగా గుర్తించరాదని ఆర్ఎస్ఎస్ కేంద్ర హోం శాఖకు మనవి చేసిందని తెలిసింది. అంతే కాకుండా లింగాయతులను మైనారిటీలుగా ఎందుకు గుర్తించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే పరోక్షంగా ప్రశ్నించారు.
లింగాయత, వీరశైవులు కీలకం
కర్ణాటక శాసన సభ ఎన్నికలు మే 12వ తేదీన జరగనున్నాయి. శాసన సభ ఎన్నికల్లో లింగాయత, వీరశైవులు ఎవరివైపు మొగ్గుచూపుతారో అని ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కలవరం మొదలైయ్యింది. అధిక శాతం ఓటు బ్యాంకు ఉన్న ఈ రెండు వర్గాలు ఎవరివైపు మొగ్గు చూపుతారో అనే విషయం అర్థం కావడంలేదు.
సీఎం సిద్దూ ధీమా !
లింగాయతలను మైనారిటీలుగా ప్రకటించాలని గత సంవత్సరం నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్లాన్ వేశారు. సరిగ్గా శాసన సభ ఎన్నికలు సమీపించిన సమయంలో సీఎం సిద్దరామయ్య తాను అనుకున్న పని పూర్తి చేసి బీజేపీని ఇరకాటంలో పడేశారు.