చిక్కుల్లో సిద్ధు: గంటన్నర యోగాకు బిపాసాకు కోటిన్నర?
బెంగుళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజాగా మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కర్ణాటక రాజధాని బెంగుళూరులో నిర్వహించిన యోగా శిబిరంలో గంటన్నర పాటు పాల్గొన్నందుకు బాలీవుడ్ తార బిపాసాబసుకు కోటిన్నర చెల్లించారు.
వివరాల్లోకి వెళితే... అంతర్జాతీయ యోగా డే రోజున యోగా శిబిరానికి కర్ణాటక ప్రభుత్వం బాలీవుడ్ భామ బిపాసా బసును ఆహ్వానించింది. ఏకంగా ప్రభుత్వం నుంచి స్వయంగా ఆహ్వానం అందడంతో దానిని బిపాసాబసు క్యాష్ చేసుకుంది. గంటన్నర పాటు యోగా శిబిరంలో పాల్గొంటే రూ.1.5 కోట్లు కావాలని అడిగింది.
దీనికి సిద్ధరామయ్య ప్రభుత్వం అంగీకరించింది. దీంతో పాటు రానుపోను ఖర్చులతో పాటు ఒకరోజు బెంగుళూరులో ఆమె బస కోసం అదనంగా మరింత సొమ్ము ఖర్చుచేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం మొత్తం గురువారం వెలుగు చూడటంతో సిద్ధరామయ్య ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
కాగా, బిపాసాబసు గంటన్నర పాటు కార్యక్రమంలో పాల్గొంది. యోగా శిబిరానికి వెళ్లిన బిపాసా ఒంటికి బిగుతైన దుస్తులేసుకుని యోగా ట్రైనర్ లా పోజులివ్వడం విశేషం. గంటన్నర పాటు అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ఆమె యోగా విన్యాసాలు చేసింది.
బిపాసా యోగా విన్యాసాలు చేస్తున్నంత సేపు సిద్దరామయ్య సహా కర్ణాటక కేబినెట్ మొత్తం ఆమె వెనుకే కూర్చుండిపోయారు. ఈ గంటన్నరపాటు కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రభుత్వం కోటిన్నర చెల్లించింది. దీనిపై బీదర్లో శ్రీరామ్ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ తీవ్ర విమర్శలు చేశారు.
శతాబ్ధాల కాలంగా భారతీయ సంస్కృతికి అద్దంపట్టే యోగాకు అర్ధం లేకుండా బిపాసాబసు వ్యవహరించారని అన్నారు. ఆమె సంస్కారం కలిగిన మహిళ కాదని ఘాటైన విమర్శ చేశారు. మరింత మంది జనం రావాలనుకుంటే సన్నీలియోన్ ను పిలవకపోయారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.