పెద్ద నోట్లపై గడువు పెంచండి: కాంగ్రెస్ సీఎం మనవి
బెంగళూరు: రూ.1,000, రూ.500 పెద్ద నోట్ల చెలామణి గడువును డిసెంబర్ 30 వరకు పెంచాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పెద్ద నోట్ల రద్దు పై ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు.
పెద్ద నోట్ల చెలామణి గడువు పెంచాలని సీఎం సిద్దరామయ్య కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. కో ఆపరేటివ్ బ్యాంకులకు సరిపడా కొత్త కరెన్సీ సరఫరా చేసేలా ఆదేశాలు ఇవ్వాలని మనవి చేశారు.
అదే విధంగా ప్రయివేటు ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులు, డయాగ్నోస్టిక్ లాబ్స్ పాత నోట్లు తీసుకునేలా చర్యలు చేపట్టాలని మనవి చేశారు. ఇలా ఆదేశాలు జారీ చేస్తే ప్రజలు కొంత మేరకైనా ఊపిరిపీల్చుకుంటారని, వారిని సమస్యలను నుంచి కాపాడాలని సీఎం సిద్దరామయ్య కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞఫ్తి చేశారు. పాత పెద్ద నోట్ల చెలామణిని ఈ నెల 24వ తేది వరకు కేంద్ర ప్రభుత్వం పొడగించిన విషయం తెలిసిందే.