ఐఏఎస్ డికే రవి కేసు: సిద్ధు లిఖితపూర్వక సమాధానం, ఏమన్నారు?
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే. రవి అనుమానాస్పద మృతి కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య శాసన సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో సిద్దరామయ్య రాసిన ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. డికె రవి నిజాయితీగల ఐఏఎస్ అధికారి అని, ఆయన మరణం తమకు బాధ కలిగించిందని ఆయన అన్నారు.
రవి కేసును రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. రవి కేసులో ఎవ్వరిని కూడా తమ ప్రభుత్వం రక్షించడానికి ప్రయత్నించడం లేదని సిద్దరామయ్య స్పష్టం చేశారు. డి.కే. రవి కేసుకు సంబంధించి శాసన సభలో ప్రతిపక్షాలు పలు ఆరోపణలు చెయ్యడంతో సిద్దరామయ్య లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
రవి కుటుంబ సభ్యుల ఆవేద చూశామని, ఒక నిజాయితీగల అధికారి కుటుంబ సభ్యుల మనోభావాలను గౌరవిస్తూ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించామని అన్నారు. డి.కే. రవి కేసు దర్యాప్తు సీఐడి అధికారులు చేస్తూ వచ్చారని, ఈ కేసు విచారణ ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చిందని అన్నారు.
తాను కేసు దర్యాప్తు సీబీఐకి ఇవ్వనని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. సీఐడి అధికారులు సమర్పించిన నివేదికను పరిశీలించిన తరువాత తగిన నిర్ణయం తీసుకుందామని భావించానని సీఎం సిద్దరామయ్య చెప్పారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి సంఘటనలు జరిగిన తరువాత స్థానిక పోలీసులు మొదట దర్యాప్తు చేసి నివేదిక సమర్పిస్తారని అన్నారు. లేదంటే స్థానిక పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని, తరువాత దర్యాప్తు చేసే కేసుల మీద ఆ ప్రభావం పడుతుందని అన్నారు. డికే. రవి కేసు విషయంలో ప్రతిపక్షాలు లేనిపోని రాద్దాంతం చేశాయని, నిరాధారమైనఆరోపణలు చెయ్యడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని అన్నారు.
అందువల్లనే తాము రవి కేసులో సీఐడి అధికారులు తయారు చేసిన మద్యంతర నివేదిక శాసన సభలో ప్రవేశ పెట్టాలని బావించామని, హైకోర్టు ఆదేశాల వలన అది సాధ్యం కాలేదని సిద్దరామయ్య తెలిపారు. గతంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని సిద్దరామయ్య గుర్తు చేశారు. ఆ సమయంలో అనేక కేసుల దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని తాము డిమాండ్ చేస్తే వారు అంగీకరించలేదని ఆరోపించారు. సీబీఐ కాంగ్రెస్ ఏజెంట్ అని ఎద్దేవా చేసిన బీజేపీ నాయకులు ఇప్పుడు రవి కేసు దర్యాప్తును అదే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చెయ్యడం విడ్డూరంగా ఉందని సిద్దరామయ్య సిద్ధరామయ్య అన్నారు.