బీజేపీ ధీమాగా.. కాంగ్రెస్ డీలాగా..! కాసేపట్లో బలపరీక్ష..!! బలబలాలివే
బెంగళూరు: కర్ణటకలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ జనతాపార్టీ సన్నాహాలు పూర్తి చేసింది. ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బీఎస్ యడియూరప్ప ఇప్పటికే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభలో ఆయన తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. సోమవారం బలపరీక్షను ఎదుర్కొనబోతున్నారాయన. పార్టీపరంగా దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. ఆదివారం రాత్రి యడియూరప్ప బీజేపీ సభాపక్ష సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ఆ పార్టీకి చెందిన 105 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్కుమార్ అనర్హత వేటు వేసిన నేపథ్యంలో- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం 103 పడిపోయింది. బీజేపీకి ప్రస్తుతం 105 సభ్యుల బలం ఉన్నందున.. ఈ బలపరీక్షలో నెగ్గుకు రావడం కేవలం లాంఛనప్రాయమే.
తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న యడియూరప్ప
సోమవారం ఉదయం 11 గంటలకు శాసనసభ ఆరంభం అవుతుంది. ఆ వెంటనే ముఖ్యమంత్రి స్థానం నుంచి యడియూరప్ప బలపరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దీనిపై చర్చ కొనసాగుతుంది. ఆ తరువాతే ఓటింగ్ నిర్వహిస్తారు. మూజువాణి పద్ధతిలో ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో బీజేపీ ఇక ఊపిరి పీల్చుకుంటోంది. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆ పార్టీ స్వాగతిస్తోంది కూడా. ఉన్న 105కు తోడు బీఎస్పీ సభ్యుడిని కూడా కలుపుకొంటే 106 మంది అవుతారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం కంటే ఓ ముగ్గురు ఎక్కువే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో యడియూరప్ప బలపరీక్షను గెలవడం అనేది నల్లేరు మీద నడకలాంటిదే.
మేజిక్ ఫిగర్ అందుకోవడం ఈజీ..
ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకోవడం ఆయన ముందున్న అసలు టార్గెట్. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ హవా వీస్తోంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో 28 స్థానాల్లో 26ను గెలచుకుందా పార్టీ. ఈ ఎన్నికలతో పోల్చుకుంటే- వచ్చే ఉప ఎన్నికలను బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమే అవుతుంది. ఏ రకంగా చూసినా.. బీజేపీకి ముందున్నది మంచి కాలమే అనిపిస్తోంది. కర్ణాటక శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 225. ఇందులో 17 మందిపై అనర్హత వేటు పడింది. మొత్తం సభ్యుల బలం 208కి క్షీణించింది.
ఫలితంగా- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ సైతం 112 నుంచి 103కు దిగజారింది. ఈ రకంగా చూస్తే- బీఎస్ యడియూరప్ప బలపరీక్ష నెగ్గడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే భారతీయ జనతాపార్టీకి సభలో 105 మంది సభ్యుల బలం ఉంది. బహుజన్ సమాజ్ వాది పార్టీ సభ్యుడు ఎన్ మహేష్ సైతం బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో అధికారాన్ని పోగొట్టుకున్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమికి ఉన్న సభ్యుల బలం 100. ఇందులో స్పీకర్ రమేష్కుమార్ను కూడా కలుపుకొంటే ఈ సంఖ్య 101కి చేరుతుంది. అయిదు లేదా ఆరుమంది సభ్యుల బలంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సులువు.
బలపరీక్షను నెగ్గుతాం..
బీజేపీఎల్పీ సమావేశం అనంతరం యడియూరప్ప విలేకరులతో మాట్లాడారు. తాను బలపరీక్ష తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. వందశాతం గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమి నాయకులు పెడుతున్న ప్రలోభాలకు గురి కావట్లేదని అన్నారు. తమ సభ్యులందరూ తమతోనే ఉన్నారని చెప్పారు. విశ్వాస పరీక్షలో గెలవడం లాంఛనప్రాయమేనని, కర్ణాటక ప్రజలకు ఇక సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తామని యడియూరప్ప అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కాంగ్రెస్-జేడీఎస్ నాయకులు ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదని, వాటిని సమర్థవంతంగా తిప్పికొడతామని ఆయన చెప్పారు.