టార్గెట్..స్పీకర్: అవిశ్వాస తీర్మానానికి రెడీ?
బెంగళూరు: కర్ణాటక శాసనసభ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనబోతున్నారా? కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న భారతీయ జనతాపార్టీ ఆయనను స్పీకర్ స్థానం నుంచి సాగనంపబోతోందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. శాసనసభలో తన బలాన్ని నిరూపించుకున్న తరువాత ముఖ్యమంత్రి యడియూరప్ప నెక్స్ట్ టార్గెట్ స్పీకరేనని అంటున్నారు. స్పీకర్ స్థానం నుంచి ఆయనను సాగనంపాలని ఆయన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తమ పార్టీకి చెందిన సభ్యుడిని స్పీకర్గా ఎన్నుకోవడం దాదాపు ఖాయమైంది. దీనిపై ఆదివారం రాత్రి ఏర్పాటైన బీజేపీ సభా పక్ష సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
కాస్సేపట్లో బలపరీక్ష: ధీమాగా బీజేపీ..డీలాగా కాంగ్రెస్: బలబలాలివే!
బుధవారం అవిశ్వాస తీర్మానం..
స్పీకర్ రమేష్ కుమార్పై బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. సోమవారం యడియూరప్ప బలపరీక్షను ఎదుర్కొనబోతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో.. ఆయన ఈ పరీక్షలో ఆయన విజయం సాధించడం నల్లేరు మీద నడకే. ఆ తరువాత ఆయన ముందున్న టాస్క్.. స్పీకర్గా రమేష్కుమార్ను తొలగించడం. రమేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుడు. ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే- అందులోనూ బీజేపీ గెలుపొందడం సాధ్యమే. స్పీకర్పై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం వీగిపోవడానికి ఎంతమాత్రమూ అవకాశం లేదు.
కుమార సర్కార్ను రక్షించే ప్రయత్నం చేశారంటూ..
కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభ సమయంలో స్పీకర్గా రమేష్కుమార్ కీలక పాత్ర పోషించారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి సారథ్యంలోని కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారనే అపవాదును ఆయన మూటకట్టుకున్నారు. కుమారస్వామి ప్రవేశపెట్టిన బలపరీక్ష తీర్మానాన్ని నాలుగురోజుల వరకూ సాగదీయడాన్ని దీనికి ఉదాహరణగా చూపుతున్నారు. గత్యంతరం లేకపోవడం వల్లే రమేష్కుమార్ బలపరీక్షను నిర్వహించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ గండం నుంచి కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని గట్టెక్కించడానికి ఆయన చేయాల్సిందంతా చేశారని విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి.
రెబెల్స్పై వేటుతో దేశవ్యాప్తంగా చర్చల్లోకి
కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో రమేష్కుమార్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. కర్ణాటక సంక్షోభం గురించి ప్రస్తావించాల్సి వచ్చిన ప్రతీసారీ రమేష్కుమార్ పేరు వినిపించింది. 13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్, స్వతంత్ర సభ్యుడిపై ఆయన అనర్హత వేటు వేశారు. అనర్హత వేటు వేస్తూ తీసుకున్న నిర్ణయం ద్వారా ఆయన చట్టసభల గౌరవాన్ని నిలిపారనే ప్రశంసలు కూడా అందాయి.