టెర్రరిస్ట్ హబ్గా బెంగళూరు- నిజమేనన్న యడ్యూరప్ప-ఎన్ఐఏ బ్రాంచ్కు మోడీకి వినతి...
బెంగళూరు నగరంలో తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని, నగరం టెర్రర్ హబ్గా మారిందని తాజాగా స్ధానిక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు అక్కడి బీజేపీ ప్రభుత్వంలో కలకలం రేపుతుండగానే ఏకంగా సీఎం యెడియూరప్ప రంగంలోకి దిగి ఈ ఆరోపణలను సమర్ధించారు. ఎంపీ తేజస్వి సూర్య ఆరోపణలను అంగీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
బెంగళూరు టెర్రర్ హబ్గా మారిందన్న సొంత పార్టీ ఎంపీ తేజస్వి సూర్య ఆరోపణలకు స్పందిస్తూ నగరంలో జాతీయ దర్యాప్తు సంస్ధ ఎన్ఐఏ బ్రాంచ్ ఆఫీసు ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీకి కర్నాటక సీఎం యెడియూరప్ప ఓ లేఖ రాశారు. బీజేవైఎం అధ్యక్షుడిగా తాజాగా ఎంపికైన ఎంపీ తేజస్వి సూర్య ఆరోపణలపై మాట్లాడుతూ అవును నిజమే బెంగళూరులో నేరాలు పెరిగిపోయాయని సీఎం యడ్డీ పేర్కొన్నారు. అందుకే నగరంలో శాశ్వతంగా ఎన్ఐఏ కార్యాలయం ఏర్పాటు చేయాలని హోంమంత్రి అమిత్షాను కూడా కోరినట్లు యడ్డీ వెల్లడించారు.
కొన్నేళ్లుగా భారత్లోని సిలికాన్ వ్యాలీ అయిన బెంగళూరు నగరంలో తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని, తాజాగా తీవ్రవాద అనుమానితులు, స్లీపర్ షెల్స్ను పోలీసులు అరెస్టు చేయడం పరిస్ధితి తీవ్రతకు అద్దం పడుతుందని బెంగళూరు సౌత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ తేజస్వి సూర్య తాజాగా ఆరోపించారు. ఆగస్టులో డీజే హళ్లి, కేజే హళ్లిలో జరిగిన ఘర్షణలు చూస్తుంటే నగరం తీవ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని అనిపిస్తోందని సూర్య ఆరోపించారు. ప్రస్తుతం బెంగళూరులో ఈ ఘటనలపై దర్యాప్తు చేసేందుకు అవసరమైన ఎన్ఐఏ అధికారులు లేరని, ఉన్న కొద్ది మంది అధికారులు హైదరాబాద్ నుంచి వచ్చి క్యాంపు ఆపీసు ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తేజస్వి పేర్కొన్నారు. ఈ ఆరోపణలు అంగీకరించిన సీఎం యోడియూరప్ప పూర్తిస్ధాయి ఎన్ఐఏ కార్యాలయం ఏర్పాటుకు కేంద్రాన్ని కోరారు.