తమిళనాడుకు ఉగ్రముప్పు: కర్ణాటక తీరంలో హై అలర్ట్, అప్రమత్తంగా ఉండాలంటూ సూచన
బెంగళూరు: పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఆరుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు చొరబడ్డారంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇవ్వడంతో కర్ణాటకలోని తీర ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపుచ్చారు.
ఉడిపిలోని మల్పి ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఓ పాకిస్థాన్ తోపాటు ఆరుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు తమిళనాడులోకి ప్రవేశించారని, శ్రీలంకలో తరహా దాడులు చేసేందుకు కుట్ర పన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.
సీఎస్పీ మల్పే పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పీటీఐతో మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు అన్ని పోలీస్ స్టేషన్లు హై అలర్ట్లో ఉన్నాయని తెలిపారు. ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి.
తమిళనాడులో ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం ఉండటంతో పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడులకు కుట్రపన్నుతున్నది పాకిస్థానీ కాగా, ఉగ్రబృందంలో మిగితావారు శ్రీలంక ముస్లింలని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) వర్గాలు వన్ఇండియాకు తెలిపాయి.
కాగా, ఈ ఉగ్రవాదులు హిందువులుగా చెప్పుకుంటూ.. బొట్టు పెట్టుకుని మరీ తిరుగుతున్నారని ఐబీ వర్గాల అప్రమత్తం చేస్తున్నాయి. స్థానికంగా ఉండే ప్రజలతో కొద్ది రోజులపాటు పరిచయం పెంచుకుంటారని, ఆ తర్వాత దాడులకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు.
అయితే, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోందని వివరించారు. గత కొద్ది సంవత్సరాల నుంచి కోయంబత్తూరులో రాడికలిజం, ఉగ్రవాదం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, లష్కరే తోయిబా ఈ ప్రాంతంలో బలంగా ఉందని తెలిపారు.