మళ్లీ ఆపరేషన్ లోటస్: కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా..?
కర్నాటకలో మళ్లీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత కొద్ది రోజులుగా సొంత ప్రభుత్వం వారే సీఎం కుమారస్వామికి నిద్రపట్టకుండా చేశారు. దీంతో ఆయన రాజీనామా చేసేందుకు కూడా సిద్ధం అంటూ ప్రకటించారు. ఇక కొందరైతే ఇంకా సిద్ధరామయ్యనే తాము సీఎంగా భావిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. ఇలా సంకీర్ణ ప్రభుత్వంలోనే లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే బీజేపీ ఆపరేషన్ లోటస్ను ప్రారంభించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. మళ్లీ యడ్యూరప్ప నేతృత్వంలో ఆపరేషన్ లోటస్ ప్రారంభమైందా... జేడీఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందా... లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాలను అస్థిరపరిచే యత్నం కమలం పార్టీ టేకప్ చేస్తోందా..?
వీడని సంకీర్ణ కష్టాలు
కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కష్టాలు ఇప్పుడప్పుడే వీడేలా లేవు. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వాన్ని అస్థిరపరిచి తాము గద్దెనెక్కాలని భావించిన కమలం పార్టీ... ఇందుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్లోకి వచ్చి సంప్రదింపులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలను కూడా ఓ రిసార్టుకు తరలించి జాగ్రత్త పడింది. ఆ తర్వాత దీనిపై పెద్దగా చర్చ జరగలేదు. మళ్లీ కాస్త బ్రేక్ తర్వాత బీజేపీ ఆపరేషన్ లోటస్ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు కమలనాథులు.
ముంబై రినైసా హోటల్లో బందీలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ఆపరేషన్ లోటస్లో భాగంగా బీజేపీ నేతలు మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎరవేస్తున్నారు. ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ముంబైలోని పొవొయ్ ప్రాంతంలో ఉన్న రినైసా హోటల్లో కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు ఉంచినట్లు సమాచారం. ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హోటల్లో ఉన్నారనేదానిపై అధికారికంగా స్పష్టత లేదు కానీ, విశ్వసనీయ వర్గాల సమచారం ప్రకారం ఓ 9మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హోటల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు.
ప్రారంభమైన ఆపరేషన్ లోటస్
ఇక 117 మంది సభ్యుల మద్దతు ప్రభుత్వానికి ఉంది. మొత్తం 224 సభ్యులు ఉన్నారు. అంతేకాదు బీఎస్పీ, కేపీజేపీ, స్వతంత్ర పార్టీల నుంచి ఒక్కో ఎమ్మెల్యే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. అయితే బీజేపీ నుంచి 104 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం బీజేపీనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కర్నాటకలో అవతరించింది. ఇక బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన నేపథ్యంలో ఆ సమావేశాలకు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు హాజరుకాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. సంకీర్ణ సభ్యులు రాజీనామా చేస్తే.. ఇతరులు కూడా వారి బాటే నడిచే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. తద్వారా సభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలనే యోచనలో కమలనాథులు ఉన్నట్లు సమాచారం.
ఈ సారి పక్కా స్కెచ్ వేసిన కమలనాథులు
గత నెలలో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలం కావడంతో ఈసారి కాస్త పక్కాగా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో బీజేపీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యే ప్రసాద్ లాడ్కు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఈయన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు సన్నిహితుడు. ముంబైలోని ఈ హోటల్లో మొత్తం 24 గదులను బీజేపీ బుక్ చేసినట్లు తెలుస్తోంది.మరికొంత మంది ఎమ్మెల్యేలు ఎయిర్పోర్టు దగ్గర ఉన్న రెండు హోటళ్లలో ఉండేందుకు ఏర్పాటు చేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు నిలిచారని అయితే అక్రమ మార్గంలో సంకీర్ణ ప్రభుత్వం పుట్టుకొచ్చిందని మండిపడ్డారు సీనియర్ బీజేపీ నేత కేంద్ర మంత్రి సదానంద గౌడ. ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ గౌరవిస్తుందని చెప్పారు. అవసరమైతే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని వెల్లడించారు.
మొత్తానికి కర్నాటకలో రాజకీయాలు మరోసారి ఆసక్తి రేపుతున్నాయి. అయితే ఆపరేషన్ లోటస్ దెబ్బకు కుమారస్వామి సర్కార్ నిలబడుతుందో లేదో తెలియాలంటే కొంతకాలం వేచిచూడక తప్పదు.