కాంగ్రెస్ రెబల్స్: సిద్దూకు లొంగని నేతలు, రాహుల్ గాంధీ ఎంట్రీ, సీఎం కొడుకుకు షాక్, ఏం చేస్తారు !
బెంగళూరు: లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీకి ఎక్కువ సీట్లు రాకుండా చెయ్యాలని అక్కడి కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. జేడీఎస్ నాయకులకు తాము సహకరించమని, ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం చెయ్యమని కొందరు కాంగ్రెస్ పార్టీ రెబల్ నాయకులు తేల్చి చెప్పారు.
సినిమా: నాడు హెలికాప్టర్, నేడు ఎద్దుల బండిలో నామినేషన్, చిల్లర సంచి, స్టూడెంట్ లీడర్!
పార్టీ మీద ఎదురుతిరిగిన నాయకులను మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. మండ్యలో సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చెయ్యడంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తలలు పట్టుకుంది.
అంతా మీ ఇష్టం !
మండ్య లోక్ సభ నియోజక వర్గంలో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేస్తున్నారు. మండ్యలో కొన్ని దశాభ్దాల కాలం నుంచి జేడీఎస్- కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటిది ఇప్పుడు మీ స్వార్థం కోసం జేడీఎస్ కు మద్దతు ఇవ్వమని ఎలా చెబుతారని, అంతా మీ ఇష్టం అయిపోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హైకమాండ్ మీద మండిపడుతున్నారు.
కేసులు, కోర్టులు
మండ్యలో పార్టీల అధిపత్యం కోసం కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గతంలో నువ్వానేనా అంటూ గొడవలు చేసుకున్నారు. ఇరు పార్టీల నాయకులు గొడవలు చేసుకుని పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టుకుని ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో నాయకులు వారి స్వార్థం కోసం పొత్తుపెట్టుకుని మమ్మల్ని జేడీఎస్ కు ప్రచారం చెయ్యమని చెబితే ఎలా చేస్తామని మండ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
ప్రాణం పోయినా చెయ్యం
మండ్య లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నిఖిల్ కుమారస్వామికి మద్దతుగా తాము ప్రచారం చెయ్యమని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు తేల్చి చెప్పారు. ఇంతకాలం జేడీఎస్ నాయకుల తీరుతో కేసులు పెట్టించుకుని తిరుగుతున్న మాకు ఇప్పుడు అన్ని మరిచిపోయి ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చెయ్యమని మీరు ఎలా చెబుతారు అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు.
సిద్దరామయ్య వార్నింగ్
మండ్యలో పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు స్వచ్చందంగా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలని సిద్దరామయ్య హెచ్చరించారు. అయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టించుకోవడం లేదు.
పరువు పోతుంది
మండ్య లోక్ సభ ఎన్నికల్లో సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి ఓడిపోతే పరువుపోతుందని భావించిన నాయకులు ఆందోళన చెందడంతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. అయినా పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ రెబల్ నాయకులు, కార్యకర్తలు ఆ నియోజక వర్గంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బహుబాష నటి సుమలతకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. సుమలతను గెలిపించి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామికి తగిన బుద్దిచెబుతామని కాంగ్రెస్ పార్టీ రెబల్ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి పరిస్థితిలో శుత్రువులు (జేడీఎస్ నాయకులు)తో కలిసి పని చెయ్యమని కాంగ్రెస్ పార్టీకి చెందిన అసమ్మతి నాయకులు తేల్చిచెప్పారు.