సిద్దరామయ్య ఆశీర్వాదం ఉంటే ప్రభుత్వం సేఫ్: సీఎం కుమారస్వామి, సొంత అన్న, కేంద్రం మోసం!
ధారవాడ/బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆశీర్వాదం ఉన్నంత వరకూ మా సంకీర్ణ ప్రభుత్వం సవ్యంగా ఉంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. సిద్దరామయ్య తనకు సొంత అన్నతో సమానం అని, ఆయనకు మాకు మద్య ఎలాంటి అభిప్రాయవిభేదాలు లేవని సీఎం కుమారస్వామి స్పష్టం చేశారు.
ధారవాడ జిల్లా కుందగోళ్ లో సంకీర్ణ ప్రభుత్వం ఆధ్వరయంలో భారీ బహిరంగ సభా సమావేశం ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజక వర్గంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మొదటిసారి సీఎం కుమారస్వామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కుమారస్వామి బీజేపీ మీద విరుచుకుపడ్డారు.
రాష్ట్రం అభివృద్ది కోసం !
రాష్ట్రం అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి తాము సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశామని, అందులో ఎలాంటి కుమ్మక్కు లేదని సీఎం కుమారస్వామి స్పష్టం చేశారు. రుణమాఫి విషయంలో బీజేపీ నాయకులు లేనిపోని అపద్దాలు చెబుతున్నారని, దానిని మీడియా వాళ్లు సీరియల్స్ చూపిస్తున్నట్లు చూపిస్తున్నారని సీఎం కుమారస్వామ విచారం వ్యక్తం చేశారు. ధారవాడ జిల్లా అభివృద్ది కోసం రూ. 290 కోట్లు నిధులు తాము మంజూరు చేశామని సీఎం కుమారస్వామి అన్నారు.
బీజేపీ డ్రామాలు
సంకీర్ణ ప్రభుత్వం మీద బీజేపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అయినా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తాము శక్తివంచన లేకుండా పని చేస్తున్నామని సీఎం కుమారస్వామి అన్నారు. సిద్దరామయ్య సీఎంగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన అన్ని పథకాలు తాము కొనసాగిస్తున్నామని సీఎం కుమారస్వామి వివరించారు. రైతులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతామని, అందులో ఎలాంటి అనుమానాలు లేవని సీఎం కుమారస్వామి వివరించారు .
కేంద్ర మోసం చేసింది !
మీడియా వార్తలకు తాను బెదిరిపోనని సీఎం కుమారస్వామి అన్నారు. వడ్డి మాఫీ విషయంలో కేంద్ర ప్రభుత్వం మనకు తీరని అన్యాయం చేసిందని కుమారస్వామి ఆరోపించారు. మంత్రి డీకే. శివకుమార్ ను రౌడియిజం చెయ్యడానికి ఇక్కడికి తీసుకురాలేదని, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుసుమక్కను గెలిపించుకోవడం కోసం ఆయన్ను ఇక్కడికి రప్పించామని సీఎం కుమారస్వామి వివరించారు.
పేదలను చూస్తే కన్నీరు వస్తోంది
పేదలను చూస్తే మాకు కన్నీరు వస్తోందని సీఎం కుమారస్వామి అన్నారు. ఐటీ దాడులు జరిగిన సమయంలో డీకే. శివకుమార్ కన్నీరు పెట్టుకోలేదని, ఆయన తల్లిని విచారణ పేరుతో మూడు గంటల పాటు ఐటీ శాఖ అధికారుల ముందు నిలబెట్టిన సమయంలో ఆయన కన్నీరు పెట్టుకోలేదని, పేదల సమస్యలు విన్న సమయంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారని సీఎం కుమారస్వామి అన్నారు. కుందగోళ్ శాసన సభ నియోజక వర్గంలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ అభ్యర్థి కుసుమక్క కచ్చితంగా విజయం సాధిస్తారని సీఎం కుమారస్వామి జోస్యం చెప్పారు.