షాక్: కర్ణాటక కాంగ్రెస్ కమిటీ రద్దు, ఢిల్లీ దెబ్బకు నాయకుల విలవిల, సిద్దూ దెబ్బకు గంటల్లో ఎఫెక్ట్ !
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ కమిటీ (కేపీసీసీ)ని రద్దు చేస్తూ బుధవారం ఏఐసీసీ ఆదేశాలు జారీ చెయ్యడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ కు గురైనారు. కేంద్ర మాజీ మంత్రులు, మంత్రులతో పాటు అనేక మంది సీనియర్ నాయకులు కేపీసీసీ కమిటీలో ఉన్నారు.
అయితే కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే మాత్రం వారి పదవుల్లో కొనసాగుతారని, మిగిలిన నాయకుల పదవులు అన్నీ తక్షణం రద్దు చేస్తున్నామని ఢిల్లీలో హైకమాండ్ ప్రకటించింది. కేపీసీసీ నూతన కమిటీని త్వరలో ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హై కమాండ్ చెప్పింది.
కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య బుధవారం అనేక అంశాల మీద కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు. కర్ణాటకలో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ కు లేఖ రాశారు.
సిద్దరామయ్య లేఖ రాసిన కొన్ని గంటల్లోనే స్పందించిన కాంగ్రెస్ పార్టీ మొదట కేపీసీసీని రద్దు చేసింది. తరువాత సంకీర్ణ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేల మీద కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ మంత్రి, త్రిబుల్ షూటర్ డీకే. శివకుమార్ ఢిల్లీలో మకాం వేశారు. కేపీసీసీ పగ్గాలు డీకే. శివకుమార్ కు అప్పగించే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో మంత్రి డీకే. శివకుమార్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
గాంధీ కుటుంభానికి, కాంగ్రెస్ పార్టీకి తాము విధేయులమని మంత్రి డీకే. శివకుమార్ అన్నారు. తనకు ఈ పదవులు కావాలని ఇంత వరకు తాను ఎప్పుడూ హైకామండ్ కు చెప్పలేదని, అయితే పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటానని మంత్రి డీకే శివకుమార్ అంటున్నారు.