అయ్యా బెదిరిస్తున్నారు, రెబల్ ఎమ్మెల్యేలు: ముంబైలో కాంగ్రెస్ నాయకుల మీద కేసు, దెబ్బకు !
ముంబై: కర్ణాటక ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన రెబల్ ఎమ్మెల్యేలు తమను కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు బెదిరిస్తున్నారని, వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని ముంబై నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. రెబల్ ఎమ్మెల్యేల ఫిర్యాదుతో ముంబైలో కేసు నమోదు చేశారు.
రాజీనామాలు వెనక్కి !
ముంబై నగర పోలీసు కమిషనర్ సూచన మేరకు ముంబైలోని ఫోవాయ్ పోలీస్ స్టేషన్ లో రెబల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకుల మీద ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు తమను రాజీనామాలు వెనక్కి తీసుకోమని బెదిరిస్తున్నారని రెబల్ ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏ నాయకుడు వద్దు !
మాజీ కేంద్ర మంత్రి మల్లికార్జున్ ఖార్గే, గులామ్ నబి ఆజాద్ తో సహ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ నాయకుడిని తాము కలవడానికి తాము సిద్దంగా లేమని రెబల్ ఎమ్మెల్యేలు పోలీసులకు చెప్పారు. అదే విధంగా మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులను తాము కలవమని, వారి నుంచి రక్షణ కల్పించాలని రెబల్ ఎమ్మెల్యేలు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసు భద్రత
తమను ఏ నాయకుడు కలవకుండా చూడాలని, తాము బస చేసిన హోటల్ దగ్గర మరింత భద్రత పెంచాలని రెబల్ ఎమ్మెల్యేలు ముంబై నగర పోలీసు కమిషనర్ కు మనవి చేశారు. రెబల్ ఎమ్మెల్యేల మనవి మేరకు వారు బస చేసిన హోటల్ దగ్గర పోలీసుల భద్రతను కట్టుదిట్టం చేశారు.
ముందు జాగ్రత్త !
కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నాయకులు రెబల్ ఎమ్మెల్యేను కలవడానికి ప్రయత్నిస్తే అందుకు అవకాశం ఇవ్వరాదని ముంబై నగర పోలీసు కమిషనర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ముంబై పోలీసుల భద్రత నడుమ రెబల్ ఎమ్మెల్యేలు స్టార్ హోటల్ లో బస చేశారు.
చలో ముంబై !
కర్ణాటకకు చెందిన కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు సోమవారం ముంబై చేరుకునే అవకాశం ఉందని సమాచారం రావడంతో తమకు భద్రత కల్పించాలని రెబల్ ఎమ్మెల్యేలు నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారని తెలిసింది. రాజీనామాలు వెనక్కి తీసుకోవాలని రెబల్ ఎమ్మెల్యేలకు నచ్చచెప్పడానికి ఆదివారం కొందరు కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు ముంబై వెళ్లారు.