కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు కేరళకు షిఫ్ట్: ఆపరేషన్ కమల, జారిపోతున్నారు, భయం!
బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని బిడిదిలో ఉన్న ఈగల్టన్ రిసార్టులోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ది గాల్ఫ్ విలేజ్ రిసార్టులో ఉన్న జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కేరళకు తరలించాలని ఇరు పార్టీల నాయకులు నిర్ణయించారు. ఎమ్మెల్యేలు ఇక్కడే ఉంటే చెయ్యి జారిపోతారని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
రిసార్టుల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు బయటకు వెళ్లిపోతున్న సమయంలో ఎక్కడ అమ్ముడుపోతారో అనే భయంతో కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు ఎమ్మెల్యేలను కేరళలోని కొచ్చికి తరలించాలని నిర్ణయించారు. కొచ్చిలోని బవ్రంటన్ బోర్డ్ యార్డ్ అనే 7 స్టార్ హోటల్ ను ఇప్పటికే బుక్ చేశారు.
గురువారం రాత్రి 10 గంటలకు ప్రత్యేక బస్సుల్లో రిసార్టుల నుంచి ఎమ్మెల్యేలను హెచ్ఏఎల్ విమానాశ్రయంకు తరలిస్తారు. అనంతరం ప్రత్యేక విమానంలో కేరళలోని కొచ్చికి బయలుదేరుతారు. తరువాత ఎమ్మెల్యేలను 7 స్టార్ హోటల్ కు తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆపరేషన్ కమల భయంతో కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.