ఈడీ ముందు హాజరైన ఐశ్వర్య, రూ. 100 కోట్ల ఆస్తి ఎలా వచ్చింది, కూతురు పేరుతో డీకే !
న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్య న్యూఢిల్లీలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు గురువారం హాజరైనారు. ఈడీ అధికారుల ప్రశ్నలకు ఐశ్వర్య సమాధానం చెప్పడానికి సిద్దం అయ్యారని ఆమె చిన్నాన, బెంగళూరు గ్రామీణ ఎంపీ (కాంగ్రెస్) డీకే. సురేష్ మీడియాకు చెప్పారు. ఐశ్వర్యకు రూ. 100 కోట్ల ఆస్తి ఎలా వచ్చింది ? అని ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. కూతురు పేరుతో డీకే. శివకుమార్ వ్యాపారం చేశారని తెలిసింది.
ఐశ్వర్యకు రూ. 100 కోట్ల ఆస్తి ఎలా వచ్చింది ?, ఈడీకి అనుమానం, అరెస్టు చేస్తారా, అయితే ?!
రూ. 100 కోట్ల ఆస్తులు
ఐశ్వర్య తండ్రి డీకే. శివకుమార్ ను ఇప్పటికే ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారని డీకే. శివకుమార్ మీద ఈడీ కేసు నమోదు చేసింది. ఐశ్వర్య పేరు మీద రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. ఇంత చిన్న వయసులో ఐశ్వర్యకు రూ. వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి ? అని ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కూతురు పేరుతో వ్యాపారం
డీకే. శివకుమార్ ను ఈనెల 3వ తేదీ ఈడీ అధికారులు అరెస్టు చేశారు. డీకే. శివకుమార్ ఆయన కుమార్తె ఐశ్వర్య పేరు మీద పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేశారని సమాచారం. ఐశ్వర్యను విచారణ చేసే సమయంలో ఆమె ఇచ్చే సమాధానాలు రికార్డు చెయ్యాలని ఈడీ అధికారులు నిర్ణయించారు.
కేసుల్లో డీకే సన్నిహితులు
డీకే. శివకుమార్ కు అత్యంత సన్నిహితుడు, ఢిల్లీలోని కర్ణాటక భవన్ ఉద్యోగి ఆంజనేయ హనుమంతయ్య మీద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. డీకే. శివకుమార్ కు అత్యంత సన్నిహితులు అయిన నారాయణ్, ఎస్ కే. శర్మా, ఎన్. రాజేంద్ర మీద అధికారులు కేసు నమోదు చేశారు.
రూ. 8 కోట్ల నగదు
ఆంజనేయ హనుమంతయ్య, నారాయణ్, ఎస్ కే. శర్మా, ఎన్. రాజేంద్ర ఇచ్చిన సమాచారం మేరకు డీకే. శివకుమార్ అరెస్టు అయ్యారు. అక్రమంగా నగదు లావాదేవీలు చేశారని ఈడీ అధికారులు ఆరోపించారు. ఢిల్లీలోని డీకే. శివకుమార్ కు చెందిన ప్లాట్ లో రూ. 8 కోట్లకు పైగా నగదును ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
చిక్కుల్లో డీకే ఫ్యామిలీ
ఢిల్లీలోని ప్లాట్ లో స్వాధీనం చేసుకున్న నగదు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పడంలో డీకే. శివకుమార్ విఫలం అయ్యారని ఆరోపిస్తూ ఆయన్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పుడు డీకే. శివకుమార్ కుటుంబ సభ్యులను విచారణ చేసి వివరాలు సేకరించాలని ఈడీ అధికారులు సిద్దం అయ్యారు. డీకే. శివకుమార్ కూతురు ఐశ్వర్యను ఇదే సమయంలో ఈడీ విచారణ చేస్తోంది.