సారీ మైడియర్ రాహుల్జీ! పార్టీలో బఫూన్లు ఉన్నారు..: కర్ణాటక కాంగ్రెస్లో చిచ్చు
బెంగళూరు: దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తుందంటూ ఆదివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్.. కర్ణాటక కాంగ్రెస్లో చిచ్చు పెట్టాయి. ఈ చిచ్చు ఇప్పట్లో ఆరిపోయేలా కనిపించట్లేదు. సొంత పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు కర్ణాటక కాంగ్రెస్కు చెందిన సీనియర్ నేత రోషల్ బేగ్. పార్టీలో కొందరు బఫూన్లు ఉన్నారని, వారి వల్లే ఈ దుస్థితి తలెత్తిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపైనా ఆయన ధ్వజమెత్తారు.
కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగైదు స్థానాలకే పరిమితం అవుతుందంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. భారతీయ జనతాపార్టీ కనీసం 23 స్థానాల్లో విజయ కేతనాన్ని ఎగుర వేస్తుందని స్పష్టం చేశాయి. 2014 ఎన్నికల సందర్భంగా.. కర్ణాటకలో బీజేపీ 17 స్థానాలను గెలుచుకోగా.. ఈ సారి ఈ సంఖ్యను మరింత మెరుగు పరుచుకుంటుందని తేటతెల్లం చేశాయి.
ఇది కాస్తా కర్ణాటక కాంగ్రెస్లో దుమారాన్ని లేవనెత్తింది. ఇన్నాళ్లూ అసంతృప్తిని అణచుకుంటూ వస్తోన్న నాయకులు ఒక్కసారిగా భగ్గు మన్నారు. కాంగ్రెస్ మైనారిటీ నేత రోషన్ బేగ్ తాజాగా పార్టీపై మండిపడ్డారు. కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్ ఓ బఫూన్ అని అభివర్ణించారు. ముఖ్యమంత్రి పదవిపై శాశ్వతంగా కూర్చోవాలని సిద్ధరామయ్య కలలు గంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కుమారస్వామిని మొదటి రోజు నుంచే ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చారని ధ్వజమెత్తారు. కుమారస్వామి చేతులు కట్టేశారని, ఆయనను స్వేచ్ఛగా పని చేసే వీలు లేకుండా చేశారని అన్నారు. మంత్రి పదవులను అమ్ముకున్నారని ఆరోపించారు.
పార్టీలో అసమర్థులు ఉన్నారని, దీని ఫలితంగా- మెజారిటీ లోక్సభ స్థానాలను కోల్పోవాల్సి వస్తోందని ఆరోపించారు. ఈ పరిస్థితి ఏర్పడినందుకు తాను పార్టీ అధినేత రాహుల్ గాంధీకి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. రాష్ట్రంలోని ముస్లింలు కూడా బీజేపీకే పెద్ద ఎత్తున ఓటు వేశారని చెప్పారు. కంచుకోటగా ఉన్న ముస్లింలు, మైనారిటీలు కొందరు నాయకుల వైఖరి వల్ల పార్టీకి దూరం అయ్యారని అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే.. ముస్లిలందరూ బీజేపీతో చేతులు కలపాలని ఆయన సూచించారు.
సిద్ధరామయ్య దూకుడుగా వ్యవహరించడం కొంప ముంచిందని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు చేసిన ప్రయత్నాలన్నీ ఫ్లాప్ షోను తలపించాయని ఆరోపించారు. ఇలాంటి వారి వల్ల పార్టీ పరువు పోయిందని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో క్రైస్తవులకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడానికి ఎవరు బాధ్యత వహించాలని ఆయన ప్రశ్నించారు. 28 సీట్లల్లో ఒకే ఒక్క స్థానాన్ని ముస్లింలకు ఇచ్చారని, అలాంటప్పుడు పార్టీకి ఓట్లు ఎలా పడతాయని అన్నారు.
రోషన్ బేగ్ చేసిన ఆరోపణలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరప్ప స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యాలు వ్యక్తిగతమైనవని తేలిగ్గా తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేశారని, ఆయనకు టికెట్ దక్కలేదని అన్నారు. ఆ అక్కసుతోనే లేనిపోని విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.