కాంగ్రెస్ లీడర్స్ పుత్రవ్యామోహం: రాహుల్ గాంధీకి అగ్నిపరీక్ష, బీజేపీ లాభం, ఏం చెయ్యాలి!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక శాసన సభ ఎన్నికలు మే 12వ తేదీ జరగనున్న సమయంలో అన్ని పార్టీల నాయకులు అభ్యర్థుల ఎంపికలో బిజీబిజీగా ఉన్నారు. అయితే కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుత్రవాత్సల్యంతో ఢిల్లీ పెద్దలకు మొరపెట్టుకుంటున్నారు. మా బిడ్డలకు టిక్కెట్ ఇవ్వండి, మేము గెలిపించుకుంటాం అంటూ వేడుకుంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అగ్నిపరీక్ష మొదలైయ్యింది. సొంత పార్టీ నాయకుల తీరుతో బీజేపీకి లాభం ఉంటోందని హైకమాండ్ లో ఆందోళన మొదలైయ్యింది.
Recommended Video
సీఎం మొదటి త్యాగం !
కర్ణాటకలో మే 12వ తేదీ జరిగే ఎన్నికలకు తమ బిడ్డలను పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిర్ణయించారు. 2013లో జరిగిన ఎన్నికల్లో సీఎం సిద్దరామయ్య మైసూరు జిల్లా వరుణా నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి వరుణ నియోజక వర్గం కుమారుడు యతీంద్రకు విడిచిపెట్టి చాముండేశ్వరి నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని సీఎం సిద్దరామయ్య నిర్ణయించారు.
సిద్దూ దెబ్బతో క్యూ !
సిద్దరామయ్య తన కుమారుడు యతీంద్రను రాజకీయాల్లోకి తీసుకురావాలి ప్రయత్నిస్తున్న సమయంలో మిగిలిన సీనియర్ నాయకులు క్యూకట్టారు. మా బిడ్డలకు టిక్కెట్లు ఇవ్వాలని ఇప్పటికే అర్జీలు సమర్పించి ఢిల్లీ పెద్దలకు మనవి చేశారు.
మంత్రులు, కేంద్ర మాజీ మంత్రులు
కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి ఆయన కుమార్తె సౌమ్య రెడ్డిని బెంగళూరులోని జయనగర్ నుంచి పోటీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు. మంత్రులు హెచ్ సి. మహదేవప్ప కుమారుడు సునీల్ బోస్, టీబీ. జయచంద్ర కుమారుడు సంతోష్, కేంద్ర మాజీ మంత్రులు వీరప్ప మొయిలీ కుమారుడు హర్షా మొయిలీ, కేహెచ్. మునియప్ప కుమార్తె రూపా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మార్గరేట్ ఆళ్వా కుమారుడు నివేదిత్ ఆళ్వా 2018 శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు.
మా పరిస్థితి ఏమిటి !
ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేసి ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయిన నాయకులు వారి నియోజక వర్గాల్లో మంత్రులు, కేంద్ర మాజీ మంత్రుల కుమారులు, కుమార్తెలు పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారని తెలుసుకుని ఇప్పుడు మా పరిస్థితి ఏమిటని నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రాహుల్ గాంధీ చేతిలో బాల్
కర్ణాటక నాయకుల కోరికలు తీర్చడం, తీర్చకపోవడం ఇప్పుడు రాహుల్ గాంధీ చేతిలో ఉంది. బాల్ ఢిల్లీకి విసిరేసిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు మూడు రోజుల్లో విడుదలవుతున్న జాబీతాలో మా బిడ్డల పేర్లు ఉండాలని దేవుడిని వేడుకుంటున్నారు. అయితే తుది నిర్ణయం రాహుల్ గాంధీది కావడంతో అప్పుడే మంత్రులు, కేంద్ర మాజీ మంత్రుల బిడ్డలకు టెన్షన్ మొదలైయ్యింది. మంత్రులు, మాజీ మంతుల కుమారులు, కుమార్తెలకు టిక్కెట్లు ఇస్తే స్థానిక నాయకులు రెబల్ అభ్యర్థులుగా పోటీ చేస్తారని, లేదా బీజేపీకి మద్దతు ఇస్తారని హైకమాండ్ భయపడుతోంది.