వరదల్లో మునిగిన ఉత్తర కర్ణాటక.. ఫొటో షూట్ లో ముఖ్యమంత్రి
బెంగళూరు: కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు, వరదల వల్ల కర్ణాటక ఉత్తర ప్రాంతంలోని పలు జిల్లాలు వణికిపోతున్నాయి. ఉత్తర కర్ణాటకలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల వల్ల వరదలు సంభవిస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల రోడ్లు, రైల్వే ట్రాకులు కొట్టుకునిపోయాయి. పలు ప్రాంతాల్లో నివాసాలు కూలిపోయాయి. ఇప్పటిదాకా 12 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కర్ణాటక కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.
వరద బాధితులను ఆదుకోకుండా ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఫొటో షూట్ కోసం ఆరాట పడుతున్నారని విమర్శించారు. దీనికి సంబంధించిన రెండు ఫొటోలను కర్ణాటక కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కర్ణాటకలో యడియూరప్ప సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులను పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి యడియూరప్ప రెండు రోజుల కిందట తన అధికారిక నివాస ప్రాంగణంలో ఓ ఫొటో షూట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దీన్ని అడ్డుగా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘాటు విమర్శలు చేస్తున్నారు. వరదల ప్రభావానికి గురై వందలాది మంది నిరాశ్రయులయ్యారని, ముఖ్యమంత్రి అవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వరద బాధితులను ఆదుకోవడం, సహాయ పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏ మాత్రం ముందుకు రావట్లేదని మండిపడ్డారు. ప్రచార కార్యక్రమాలకు అవసరమైన ఫొటో షూట్ కు ఇచ్చే ప్రాధాన్యతను వరద బాధితుల సహాయంపై పెట్టాలని హితవు పలుకుతున్నారు.
ನೆರೆ ನಿರ್ವಹಣೆಯಲ್ಲಿ ವಿಫಲರಾಗಿರುವ ಬಿಜೆಪಿ ಸರ್ಕಾರದ ಮುಖ್ಯಸ್ಥ ಮಾನ್ಯ ಯಡಿಯೂರಪ್ಪನವರು ನೆರೆ ಪರಿಹಾರದ ಕಾಮಗಾರಿಯಲ್ಲಿ ತೊಡಗುವುದನ್ನು ಬಿಟ್ಟು ೧೦೦ ದಿನಗಳ ಶೂನ್ಯ ಸಾಧನೆಯನ್ನು ಪ್ರಚಾರ ಮಾಡಲು ಜಾಹೀರಾತು ಚಿತ್ರೀಕರಣದಲ್ಲಿ ತೊಡಗಿರುವುದು ಸಂವೇದನಾ ಹೀನತೆ ಮತ್ತು ಅವರ ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನು ತೋರುತ್ತದೆ.#BJPBetrayedKarnataka pic.twitter.com/iRIgyVGZf0
— Karnataka Congress (@INCKarnataka) October 23, 2019
తమ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని, బాధితులను పరామర్శించారని, ప్రతిపక్షంలో ఉండి కూడా తాము ప్రజల ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని అధికారంలో ఉండి బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారని నిలదీశారు. వరదలు సంభవించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారైన సమీక్షా, సమావేశాలను ప్రభుత్వం నిర్వహించలేదని మండిపడ్డారు. అనైతికంగా, రాజ్యాంగ విరుద్ధంగా తమ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి, అందలాన్ని ఎక్కిన బీజేపీ నాయకులు చివరికి.. ఫొటో షూట్ లతో తీరిక లేకుండా గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.