కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా: మా ప్రభుత్వానికి ఇబ్బంది లేదని ధీమా, ఆరా తీస్తున్నా హైకమాండ్ !
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, రమేష్ జారకిహోళి రాజీనామా చెయ్యడంతో ఆ పార్టీ నాయకులు అలర్ట్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదేశాలమేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు మంగళవారం బెంగళూరులో సమావేశం అయ్యి చర్చిస్తున్నారు.
సోమవారం బళ్లారి జిల్లా విజయనగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్, అదే రోజు గోకాక్ మరో ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేష్ జారకిహోళి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు షాక్ ఇచ్చారు. ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాతో మిగిలిన అసమ్మతి ఎమ్మెల్యే మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిఘా వేశారు.
ఆనంద్ సింగ్, రమేష్ జారకిహోళి రాజీనామా చేసిన వెంటనే మంత్రులు డీకే. శికుమార్, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్, హోం శాఖ మంత్రి ఎంబి. పాటిల్ తదితర మంత్రులు మిగిలిన ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి పదవులు రాకపోయినా మీకు క్యాబినేట్ హోదా నామినేటెడ్ పదవులు ఇస్తామని, మీరు రాజీనామా చెయ్యకూడదని ఎమ్మెల్యేలకు నచ్చచెబుతున్నారు.
కర్ణాటక రాజకీయాల గురించి తెలుసుకున్న రాహుల్ గాంధీ మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఫోన్ చేసి ఇప్పటికే వివరాలు సేకరించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేస్తున్నారు, సంకీర్ణ ప్రభుత్వంలో వారికి వచ్చిన ఇబ్బందులు ఏమిటి అని రాహుల్ గాంధీ ఆరా తీశారని పార్టీ వర్గాలు అంటున్నాయి.