మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అరెస్ట్.. ఎందుకంటే..
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య,రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండు రావ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. యడియూరప్ప ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసన ర్యాలీ చేపట్టగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు బలవంతంగా వారిని అరెస్ట్ చేసి అక్కడినుంచి తరలించారు. అరెస్టుపై సిద్దారామయ్య తీవ్రంగా మండిపడ్డారు. తమ హక్కులను లాగేసుకునే హక్కు పోలీసులకు ఎంతమాత్రం లేదన్నారు. పోలీసులు చర్యలు అప్రజాస్వామికం అని మండిపడ్డారు.
కాగా, ఇటీవల బీదర్లోని ఓ స్కూల్లో పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా నాటిక ప్రదర్శించినందుకు గాను ఆ స్కూల్ యాజమాన్యంతో పాటు దాన్ని ఫేస్బుక్లో లైవ్ పెట్టినవారిపై అక్కడి పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఇటీవలే ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ఈ చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేడు బెంగళూరులోని గాంధీ విగ్రహం నుంచి సీఎం కార్యాలయం వరకు నిరసన చేపట్టారు.
ఓవైపు అనుచిత వ్యాఖ్యలు,వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న అధికార పార్టీ నాయకులు సోమశేఖర రెడ్డి,అనంత్ కుమార్ హెగ్దె లాంటి వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదని.. సీఏఏని వ్యతిరేకిస్తున్నారన్న కారణంతో తమవాళ్లపై మాత్రం కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.