8 నెలలు అజ్ఞాతవాసం, ఇంటికి, కొన్ని గంటల్లోనే అజ్ఞాతంలోకి బళ్లారి కాంగ్రెస్ లో ఎమ్మెల్యే!
బెంగళూరు: బళ్లారి జిల్లా విజయనగర (హోస్ పేటే) విదాన సభ నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ 8 నెలలు అజ్ఞాతవాసం ముగించుకుని సొంత ఇంటికి చేరుకున్నారు. విజయనగర శాసన సభ నియోజక వర్గం నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆనంద్ సింగ్ హ్యాట్రిక్ గెలుపు ఉత్సాహంతో 8 నెలలు అజ్ఞాతవాసం ముగించుకుని సొంత ఇంటికి చేరుకున్నాడు. కొన్ని గంటల్లోనే ఆనంద్ సింగ్ మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.
ఆనంద్ సింగ్ శపథం
గత సంవత్సరం అక్టోబర్ లో విజయనగర మండల బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆనంద్ సింగ్ పాల్గొన్నారు. కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఆ రోజు నియోజక వర్గంలో అభివృద్ది పనులు పూర్తి చేసి శాసన సభ ఎన్నికలు పూర్తి అయిన తరువాత తన సొంత ఇంటిలో అడుగుపెడుతానని ఆనంద్ సింగ్ శపథం చేశారు.
కుటుంబ సభ్యులకు దూరం
గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఆనంద్ సింగ్ సొంత ఇంటికి వెళ్లకుండా విజయనగర నియోజక వర్గంలో గ్రామ వాస్తవ్యం చేశారు. రాత్రిపూట గ్రామాల్లో బసచేసి వారి కష్టాసుఖాల గురించి వివరాలు తెలుసుకుని అభివృద్ది పనులు పూర్తి చేయించారు.
హోటల్ లో రూం
గ్రామ వాస్తవ్యం చేసిన ఆనంద్ సింగ్ విజయనగరలోని ఓ ప్రైవేటు హోటల్ లో గది అద్దెకు తీసుకుని కాలం గడిపారు. శాసన సభ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ప్రైవేటు హోటల్ లో బసచేసి ఎన్నికల ప్రచారం చేసిన ఆనంద్ సింగ్ విజయనగరలో మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
శపథం వెనుక జైలు జీవితం
విజయనగర శాసన సభ నియోజక వర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యే అయిన ఆనంద్ సింగ్ ఎక్కువ రోజులు అభివృద్ది పనులు పూర్తి చెయ్యలేకపోయాడు. బేలికేరి ఇనుప ఖనిజం అక్రమ రవాణా కేసులో (గాలి జనార్దన్ రెడ్డి కేసు) ఆనంద్ సింగ్ అరెస్టు అయ్యి జైలుకు వెళ్లాడు. జైలు జీవితం గడిపిన ఆనంద్ సింగ్ అనంతరం జామీను మీద బయటకు వచ్చాడు. అప్పటికే నియోజక వర్గంలో అభివృద్ది పనులు నిలిచిపోయాయి. అందుకోసం గ్రామవాస్తవ్యం చేపట్టిన ఆనంద్ సింగ్ మళ్లీ ప్రజలకు దగ్గర అయ్యాడు.
ఆనంద్ సింగ్ హ్యాట్రిక్
రెండు నెలల క్రితం బీజేపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆనంద్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్లీ విజయనగర ఎమ్మెల్యే అయ్యారు. బుధవారం ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆనంద్ సింగ్ సొంత ఇంటికి చేరుకోవడంతో హారతులు ఇచ్చి, డప్పులు, వాయిద్యాలతో స్వాగతం పలికారు.
మెజారిటీ తగ్గిపోయింది
సొంత ఇంటికి చేరుకున్న సందర్బంగా ఆనంద్ సింగ్ అభిమానులతో మాట్లాడారు. తనకు గతంలో కంటే తక్కువ మెజారిటీ వచ్చిందని, తన మీద నమ్మకంతో మళ్లీ గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని ఆనంద్ సింగ్ అన్నారు. అనంతరం బెంగళూరులో జరిగే కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష సమావేశానికి హాజరుకాకుండా, ఇంటిలో లేకుండా ఆనంద్ సింగ్ తన స్నేహితుడు, బళ్లారి గ్రామీణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాగేంద్రతో కలిసి అధిష్టానానికి అందుబాటులో లేకుండా మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.