కర్ణాటక ప్రభుత్వానికి షాక్: ఎమ్మెల్యే పదవికి రాజీనామా, మోడీ సమక్షంలో బీజేపీ తీర్థం!
బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్ద షాక్ ఇచ్చారు. శివరాత్రి పండుగ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, చించోళి శాసన సభ్యుడు డాక్టర్ ఉమేష్ జాదెవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో డాక్టర్ ఉమేష్ జాదెబ్ బీజేపీలో చేరుతారని సోమవారం ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.
సొంత గ్రామంలో స్పీకర్ !
శివరాత్రి పర్వదినం సందర్బంగా కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ కోలారు జిల్లా శ్రీనివాసపురం నియోజక వర్గంలోని అల్లగడ్డ గ్రామంలోని సొంత ఇంటికి చేరుకున్నారు. బెంగళూరులో స్పీకర్ రమేష్ కుమార్ అందుబాటులో లేరని, అల్లగడ్డలోని సొంత గ్రామంలో ఉన్నారని తెలుసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఉమేష్ జాదెవ్ సోమవారం నేరుగా అక్కడికే చేరుకున్నారు.
రాజీనామా ఎందుకంటే ?
స్పీకర్ రమేష్ కుమార్ ఇంటికి చేరుకున్న కాగ్రెస్ ఎమ్మెల్యే ఉమేష్ జాదెవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన లేఖను ఆయనకు అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పదవికి తాను ఎందుకు రాజీనామా చేశాను అనే విషయంపై డాక్టర్ ఉమేష్ జాదవ్ స్పీకర్ రమేష్ కుమార్ కు క్షుణ్ణంగా వివరించారని తెలిసింది.
సంకీర్ణ ప్రభుత్వం ఆటలు
కొంత కాలంగా కర్ణాటకలోని కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఉమేష్ జాదెవ్ గుర్రుగా ఉన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంకీర్ణ ప్రభుత్వానికి, అధికారులకు ఎన్నిసార్లు మనవి చేసినా వారు పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే ఉమేష్ జాదవ్ బహిరంగంగానే విమర్శించారు.
రాజీనామా చేస్తారు
చించోళి శాసన సభ్యుడు డాక్టర్ ఉమేష్ జాదెవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అందుబాటులో లేకుండా చాల కాలం ఉమేష్ జాదెబ్ మాయం అయ్యారు. డాక్టర్ ఉమేష్ జాదెవ్ మార్చి 4వ తేదీన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ఆదివారం ఆయన సోదరుడు మీడియాకు చెప్పారు. చెప్పినట్లే ఉమేష్ జాదెవ్ సోమవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
మోడీ సమక్షంలో బీజేపీ తీర్థం !
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఉమేష్ జాదెవ్ మార్చి 6వ తేదీ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో బీజేపీలో చేరుతారని ఆయన సోదరుడు సోమవారం మీడియాకు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తీరుతో విసిగిపోయిన తన సోదరుడు ఉమేష్ జాదెవ్ బీజేపీలో చేరి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి శక్తి వంచనలేకుండా పని చేస్తారని ఆయన వివరించారు.