బలపరీక్షకు ముందు హైడ్రామా: జారుకుంటున్న ఎమ్మెల్యేలు
బెంగళూరు: రెండువారాలుగా కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం చివరి అంకానికి చేరుకుంది. అధికారాన్ని పంచుకుంటున్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమి బలపరీక్ష రూపంలో విషమ పరీక్షను ఎదుర్కొంటోంది. మరి కొన్ని గంటల్లో శాసనసభలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోనున్న నేపథ్యంలో- కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే ఒకరు అదృశ్యం అయ్యారు. ఆయన పేరు శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్. కగ్వాడ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
తిరుగుబాటు ఎమ్మెల్యే రమేష్ జార్కిహోళికి అత్యంత ఆప్తుడు. బుధవారం రాత్రి నుంచి ఆయన కనిపించట్లేదంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వెల్లడించింది. బెంగళూరు శివార్లలో దేవనహళ్లిలోని ప్రకృతి రిసార్ట్స్ నుంచి రాత్రి 8 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఆయన కారులో వెళ్లిపోయారని పీసీసీ నాయకులు తెలిపారు. ఆయన సెల్ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందని పేర్కొన్నారు. దీనిపై వారు దేవనహళ్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బంగారుపేటె శాసన సభ్యుడు నారాయణ స్వామి సైతం ఎవరికీ చెప్పకుండా రిసార్ట్ నుంచి బయటికి వెళ్లడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదని తెలుస్తోంది. నారాయణ స్వామితో పాటు శిడ్లఘట్ట ఎమ్మెల్యే వీ మునియప్ప కూడా రిసార్ట్స్లో నివసించట్లేదు. అనారోగ్య కారణాల వల్ల మునియప్ప అందుబాటులో లేరని ఆయన కుమారుడు వెల్లడించారు.
కాగా- బుధవారం రాత్రి ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రకృతి రిసార్ట్స్కు చేరుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. చాలాసేపు కుమారస్వామి అక్కడే గడిపారు. తన ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమవైపు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.