మాజీ మంత్రి రామలింగా రెడ్డికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వానికి షాక్, బీజేపీలోకి !
బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తీవ్ర విమర్శలు చేసిన మాజీ మంత్రి రామలింగా రెడ్డికి అదే పార్టీకి చెందిన చిక్కబళ్లాపుర ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ మద్దతు ఇచ్చారు. మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అర్థం ఉందని, ఆయన లాంటి సీనియర్లను కొందరు సొంత పార్టీ నాయకులు నిర్లక్షం చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ విచారం వ్యక్తం చేశారు.
నిర్లక్షం చేస్తారా ?
మాజీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సినియర్ ఎమ్మెల్యేలు రామలింగా రెడ్డి, రోషన్ బేగ్ లాంటి సీనియర్లకు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే అలాంటి సీనియర్లకు అవకాశం ఇవ్వలేదని, వారిని పట్టించుకోకుండా నిర్లక్షం చెయ్యడంతో వారు ఇప్పుడు విమర్శలకు దిగుతున్నారని డాక్టర్ సుధాకర్ అన్నారు.
ఆపరేషన్ కమలా ?
మాజీ మంత్రులు రామలింగా రెడ్డి, రోషన్ బేగ్ బీజేపీలో చేరుతారు అనే సమాచారం తన దగ్గర లేదని, ఈ విషయంలో మీడియా ఎంతో ఆసక్తిగా చూస్తోందని, తాను అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ చెప్పారు. మాజీ మంత్రులు రామలింగా రెడ్డి, రోషన్ బేగ్ విషయంలో త్వరలో మాట్లాడుతానని డాక్టర్ సుధాకర్ అన్నారు.
సీఎం నిర్ణయం
మంత్రి వర్గ విస్తరణ చెయ్యడం చెయ్యకపోవడం సీఎం కుమారస్వామికి సంబంధించిన విషయం, తన సామర్థానికి తగిన పదవి ఇస్తారని ఎదురు చూస్తున్నానని, వేచి చూడాలని డాక్టర్ సుధాకర్ అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికి సీఎం కుమారస్వామి ప్రయత్నాలు చెయ్యాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని, పార్టీ మారే అభిప్రాయం తనకు లేదని డాక్టర్ సుధాకర్ అన్నారు. కర్ణాటకలో బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ అధికారంలోకి రావడానికి ఇంకా 9 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉందని డాక్టర్ సుధాకర్ చెప్పారు. అయితే సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునే సామర్థం కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉందని, బీజేపీ అంత త్వరగా అధికారంలోకి రాలేదని డాక్టర్ సుధాకర్ అన్నారు.
సిద్దరామయ్య ప్రచారం
మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద జేడీఎస్ నాయకుడు విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలపై డాక్టర్ సుధాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తుమకూరులో మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ, హాసన్ లో ప్రజ్వల్ రేవణ్ణ, మండ్యలో నిఖిల్ కుమార్ స్వామి తదితరులకు మద్దతుగా మాజీ సీఎం సిద్దరామయ్య ప్రచారం చేశారని, ఆయన మీద ఎలా నిందలు వేస్తారని విశ్వనాథ్ ను డాక్టర్ సుధాకర్ ప్రశ్నించారు. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి విశ్వనాథ్ రాజీనామా చెయ్యకుండా ఉండాల్సిందని, అయితే ఆ విషయం ఆ పార్టీకి సంబంధించిందని డాక్టర్ సుధాకర్ అన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ఒకరికి ఒకరు బహిరంగంగా మద్దతు ఇచ్చుకుంటున్నారు.