బలపరీక్షలో గవర్నర్ జోక్యంపై కాంగ్రెస్ ఫైర్!
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ ప్రభుత్వం ప్రస్తుతం శాసనసభలో ఎదుర్కొంటోన్న బలపరీక్ష అంశం చివరికి రాజ్భవన్ గడప తొక్కింది. ఈ వ్యవహారం మొత్తం గవర్నర్ వజూభాయ్ వాలా దృష్టికి చేరింది. ఇందులో ఆయన జోక్యం చేసుకున్నారు. బలపరీక్ష నిర్వహించడంలో నెలకొన్న జాప్యాన్ని వెంటనే నివారించాలని ఆయన స్పీకర్ రమేష్కుమార్ను ఆదేశించారు. ఈ మేరకు తన వ్యక్తిగత కార్యదర్శి సహా కొంతమంది సిబ్బందిని ఆయన శాసనసభకు పంపించారు.
బలపరీక్షను నిర్వహించకుండా అధికార కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సభ్యులు అనవసరంగా కాలయాపన చేస్తున్నారని ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ వారు గురువారం మధ్యాహ్నం భోజన విరామం కోసం సభ వాయిదా పడిన తరువాత గవర్నర్ను కలిశారు. బీజేపీ సీనియర్ నేతలు జగదీష్ శెట్టర్, అరవింద్ లింబావలి, బసవరాజ్ బొమ్మి, ఎస్ఆర్ విశ్వనాథ్, ఎన్ రవికుమార్ గవర్నర్ను కలిశారు. ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు.
బలపరీక్షలో ట్విస్ట్: మా ఎమ్మెల్యే కిడ్నాప్ అయ్యారంటూ ఫిర్యాదు: ఆ సంగతి తేల్చండన్న స్పీకర్
దీనిపై గవర్నర్ వజూభాయ్ వాలా తక్షణమే స్పందించారు. గురువారం రాత్రి నాటికి బలపరీక్షను ముగించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన స్పీకర్ను ఆదేశించారు. తన ప్రతినిధులుగా కొందరు అధికారులను శాసనసభకు పంపించారు. బలపరీక్షలో నెలకొన్న జాప్యాన్ని నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా- గురువారం రాత్రి నాటికి బలపరీక్ష నిర్వహించాలని అన్నారు. ఇందులో జాప్యం చోటు చేసుకోవడం.. అటు రాజ్యాంగాన్ని ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్టవుతుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
దీనిపై కాంగ్రెస్ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. శాసనసభా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదని అంటున్నారు. గవర్నర్ పక్కా భారతీయ జనతాపార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిన విషయం గవర్నర్కు తెలియదా? అని మండిపడుతున్నారు. సుప్రీంకోర్టు నుంచి నిర్దేశిత లిఖతపూరక ఆదేశాలు గానీ, ఉత్తర్వులు గానీ అందనప్పటికీ- శాసనసభలో బలపరీక్షను నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం కాదా? అని కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ వజూభాయ్ వాలాను నిలదీస్తున్నారు. శాసనసభ నియమ, నిబంధనల ప్రకారమే బలపరీక్ష కొనసాగుతుందే తప్ప గవర్నర్ సూచనల మేరకు కాదని విమర్శిస్తున్నారు.