గాలి జనార్దన్ రెడ్డి కలకలం: నకిలీ ఆడియో అంటున్న బీజేపీ, కాంగ్రెస్ డ్రామాలు: కేంద్ర మంత్రి!
బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ అధికారంలో రావాలంటే మెజారిటీ శాసన సభ్యుల మద్దతు అవసరం. అయితే బీజేపీ ఇప్పటి వరకూ 105 మంది ఎమ్మెల్యే మద్దతు మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి డబ్బు, మంత్రి పదవి ఎర చూపి లొంగదీసుకోవడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఆడియో నకిలీదని బీజేపీ ఆరోపిస్తోంది.
కాంగ్రెస్ డ్రామాలు
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప శనివారం 4 గంటల సమయంలో బలపరీక్ష నిరూపించుకుంటున్న సమయంలో కన్నడిగులను తప్పుదోవపట్టించడానికి డ్రామాలు ఆడుతోందని, మిమిక్రీ ఆర్టిస్టుల దగ్గర మాట్లాడించి నకిలీ ఆడియో విడుదల చేసిందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ ఆరోపించారు.
కొన్ని గంటల ముందు ఎందుకు !
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి రాయచూరు గ్రామీణ శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే బసవనగౌడ దద్దాల్ కు ఫోన్ చేసి భారీ మొత్తంలో నగదు, మంత్రి పదవి ఇస్తామని, బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఒత్తిడి చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీఎస్. ఉగ్రప్ప శుక్రవారం బెంగళూరులో ఓ వీడియో విడుదల చేశారు. బలపరీక్షకు కొన్ని గంటల ముందే ఆడియో ఎందుకు విడుదల చేశారని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ ప్రశ్నించారు.
గతంలో నకిలీ వీడియో
బీజేపీ ప్రస్తుతం యడ్యూరప్ప విశ్వాసపరీక్షలో విజయం సాధించాలంటే కచ్చితంగా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెలకు ఎరవెయ్యాలి. ఈ సందర్బంలో బీజేపీ తన ఖజానా అయిన గాలి జనార్దన్ రెడ్డిని రంగంలోకి దింపిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీనియర్ న్యాయవాది వీఎస్. ఉగ్రప్ప ఆరోపించారు. ఉగ్రప్ప ఇంతకు ముందు ఓ నకిలీ వీడియో విడుదల చేసి ప్రజలను ఆయోమయానికి గురి చేశారని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ ఆరోపించారు.
ఎమ్మెల్యే చెప్పాలి
రాయచూరు గ్రామీణ శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే బసవనగౌడ దద్దాల్ బీజేపీకి మద్దతు ఇస్తే నేరుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి ముందు కుర్చోబెట్టి నీకు ఏ పదవికావాలో ఆపదవి ఇప్పిస్తానని గాలి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారని ఆడియో క్లిప్పింగ్ విడుదల చేసి కాంగ్రెస్ పార్టీ నవ్వులపాలైయ్యిందని, దమ్ముంటే ఎమ్మెల్యేతో మీడియా ముందు సాక్షం చెప్పించాలని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ సవాలు విసిరారు.
నా మద్దతుతో కోటీశ్వరులు
శివనగౌడ నాయక్, రాజు గౌడ తదితరులు తన వల్లే ఈ రోజు కోట్ల రూపాయల ఆస్తులు సంపాధించారని, నా మాట వింటే నువ్వు అమ్ముకున్న ఆస్తులకు వందరెట్లు సంపాధించుకోవచ్చని రాయచూరు గ్రామీణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బసవనగౌడ దద్దాల్ కు గాలి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారని కాంగ్రెస్ ఆరోపించడంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ మండిపడ్డారు.