కాంగ్రెస్ టేప్ ట్రాప్, బళ్లారి రెడ్డి, యడ్యూరప్ప, శ్రీరాములు, 40 మంది ఎమ్మెల్యేలకు గాలం, విఫలం!
బెంగళూరు: ఆపరేష్ కమలను కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు దీటుగా ఎదుర్కొన్నాయి. రిసార్టు రాజకీయాలు చేసి ఎమ్మెల్యేలు చీలిపోకుండా కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు జాగ్రత్తలు తీసుకుని కర్ణాటకలో అధికారంలో రావడానికి సిద్దం అయ్యాయి. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు గాలం వెయ్యడానికి ప్రయత్నించిన పెద్దపెద్ద నాయకులు ఇప్పుడు ఇబ్బందుల్లోపడ్డారు. గాలి జనార్దన్ రెడ్డి, యడ్యూరప్ప, శ్రీరాములు తదితర నాయకులు 40 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించడంలో పూర్తిగా విఫలం అయ్యారు.
మే 15వ తేదీ స్కెచ్
మే 15వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు అలర్ట్ అయ్యారు. బీజేపీకి 104 ఎమ్మెల్యే సీట్లు రావడంతో మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల కోసం ఆపరేషన్ కమల చేపడుతారని కాంగ్రెస్, జేడీఎస్ కు అనుమానం వచ్చింది.
బీజేపీ కంటే కాంగ్రెస్ ముందు
కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. బీజేపీ కంటే ఒక్క అడుగు ముందుకు వేసిన కాంగ్రెస్ నాయకులు జేడీఎస్ పార్టీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.డి. కుమారస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
మే 15వ తేదీ కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఓ మధ్యవర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి బీజేపీలోకి ఆహ్వానించారని తెలిసింది. తరువాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రిసార్టుకు వెళ్లారు. రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేల దగ్గర ఉన్న ఫోన్లు లాక్కొంటారని అనుకున్నారు. అయితే వారి ఫోన్లు వారికే ఇచ్చి ఎవరు ఫోన్ చేసినా రిసీవ్ చెయ్యాలని, ఎవరైనా బీజేపీలోకి రావాలని ఆహ్వానిస్తే ఆ మాటలు ఫోన్ లో రికార్డు చేసి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించింది.
40 మందికి గాలం
కాంగ్రెస్- జేడీఎస్ పార్టీలకు చెందిన దాదాపు 40 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసిన బీజేపీ నాయకులు మా పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కాంగ్రెస్ నాయకులు ఫోన్ లో తమ మాటలు రికార్డు చేస్తున్నారని పసిగట్టలేని బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలకు లెక్కకు మించిన హామీలు ఇచ్చారు.
మీడియాకు ఇవ్వాలి
బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు చేసిన అన్ని ఫోన్ కాల్స్ రికార్డు చేశారు. బీజేపీ నాయకుల ఫోన్లలోని ఆడియో క్లిప్పింగ్ లు మీడియాకు విడుదల చేసే భాద్యతను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయుడు వీఎస్. ఉగ్రప్పకు అప్పగించారు. బలపరీక్షకు ముందు రోజు గాలి జనార్దన్ రెడ్డి ఆడియో, బలపరీక్షకు కొన్ని గంటల ముందు బీఎస్. యడ్యూరప్ప కుమారుడి ఆడియో ఇలా ఆరు ఆడియో క్లిప్పింగ్స్ మీడియాకు విడుదల చేసి బీజేపీ నాయకులను ఉక్కిరిబిక్కిరి చేశారు
కాంగ్రెస్ చేతిలో అస్త్రం
బీజేపీ నాయకులు చేసిన ఫోన్ కాల్స్ రికార్డు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు చట్టపరంగా బీజేపీ నాయకుల మీద చర్యలు తీసుకోవడానికి సిద్దం అయ్యింది. యడ్యూరప్ప, మురళిధర్ రావ్, బళ్లారి శ్రీరాయులు, గాలి జనార్దన్ రెడ్డి తదితర ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు చేసిన ఫోన్ కాల్స్ రికార్డు చేసుకుని ఇప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు.