బళ్లారి శ్రీరాములు VS త్రిబుల్ షూటర్: ఉప ఎన్నికల ఫైట్, ఈసీకి ఫిర్యాదు చెయ్యాలని కాంగ్రెస్ !
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, దివంగత సీఎస్. శివళ్ళి మృతికి కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కారణం అంటూ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు సంచలన వ్యాఖ్యలు చేశారు. బళ్లారి శ్రీరాములు వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. బళ్లారి శ్రీరాములు మీద కుందగోళ్ ఎన్నికల అధికారి ఫిర్యాదు చెయ్యాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు.
శ్రీరాములు VSడీకే. శివకుమార్
గత సంవత్సరం బళ్లారి లోక్ సభ ఎన్నికల సందర్బంగా మాజీ మంత్రి బళ్లారి శ్రీరాములు, మంత్రి డీకే. శివకుమార్ ఒకరి మీద ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి ఎదురైయ్యింది. బళ్లారి శ్రీరాములు మీద ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చెయ్యడానికి డీకే. శివకుమార్ సిద్దం అయ్యారు. ఈ విషయంలో బళ్లారి లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి వీఎస్. ఉగ్రప్పతో డీకే. శివకుమార్ చర్చలు జరుపుతున్నారు.
బళ్లారి శ్రీరాములు ఆరోపణలు
బళ్లారి శ్రీరాములు మాట్లాడుతూ సీఎస్. శివళ్ళి మంచి వ్యక్తి అన్నారు. ప్రస్తుతం ఆయన మరణించారని, అందువలన ఆయన గురించి తాను ఎక్కువ మాట్లాడనని అన్నారు. అయితే సీఎస్. శివళ్ళి చావుకు కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వమే కారణం అంటూ బళ్లారి శ్రీరాములు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా పని చేసిన సీఎస్. శివళ్ళికి సంకీర్ణ ప్రభుత్వంలో వేదించారని, అందువలనే ఆయన గుండెపోటుతో మరణించారని బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు ఆరోపించారు.
డీకే. శివకుమార్ ఫైర్
బళ్లారి శ్రీరాములు వ్యాఖ్యలపై కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు మీద చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చెయ్యడానికి డీకే. శివకుమార్ సిద్దం అయ్యారు. గురువారం కుందగోళ్ నియోజక వర్గం ఎన్నికల అధికారికి బళ్లారి శ్రీరాములు మీద ఫిర్యాదు చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
మే 19 ఉప ఎన్నికలు
సీఎస్. శివళ్ళి గుండెపోటుతో మార్చి 22వ తేది మరణించడంతో కుందగోళ్ నియోజక వర్గంలో మే 19వ తేదీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కుందగోళ్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున సీఎస్. శివళ్ళి సతీమణి కుసుమావతి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఎస్.ఐ. చిక్కగౌడ పోటీ చేస్తున్నారు. బళ్లారి శ్రీరాములు చేసిన ఆరోపణలతో కుందగోళ్ ఉప ఎన్నికల వాతవరణం ఒక్కసారిగా వేడెక్కింది.