కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిష్యూం ఢిష్యూం, బళ్లారి జిల్లా మైనింగ్ గొడవలు, పెత్తనం ఎక్కువ చేశారు !
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ముష్టి యుధ్దం వెనుక పెద్ద కథ ఉందని సమాచారం. పక్క నియోజక వర్గాల మీద ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ పెత్తనం చెలాయించడం, బళ్లారి జిల్లా మైనింగ్ వ్యవహారాల విషయంలో ముందు నుంచి ఉన్న పగల కారణంగానే రిసార్టులో ఇంత పెద్ద గొడవ జరిగిందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఆపరేషన్ కమల
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీరుతో విసిగిపోయిన కొందరు ఎమ్మెల్యేలు ఆపరేషన్ కమలతో బీజేపీలో చేరాలని సిద్దం అయ్యారు. ఆనంద్ సింగ్ కూడా బీజేపీలో చేరుతారని మొదట ప్రచారం జరిగినా చివరికి ఆయన ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు.
ముంబై హోటల్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గణేష్, భీమా నాయక్ ముంబై వెళ్లి హోటల్ లో ఉన్నారని తెలిసింది. ఈ విషయాలను ఆనంద్ సింగ్ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు సమాచారం ఇస్తున్నారని, అందుకే ఆయన మీద వీరు పగ పెంచుకుని దాడి చేశారని తెలిసింది.
బళ్లారి జిల్లా మైనింగ్ గొడవ
కొంత కాలంగా బళ్లారి జిల్లా మైనింగ్ వ్యవహారాల విషయంలో వీరి మధ్య గొడవలు మొదలైనాయని తెలిసింది. విజయనగర శాసన సభ నియోజక వర్గం పక్కనే కంప్లీ నియోజక వర్గం, హగరిబోమ్మనహళ్ళి నియోజక వర్గం ఉన్నాయి. ఈ రెండు నియోజక వర్గాలు ఎస్సీలకు కేటాయించారు.
పక్క నియోజక వర్గాలు
ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ రెండు నియోజక వర్గాల మీద పట్టు సాధించడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా బీఎంఎం మైనింగ్ కంపెనీ వ్యవహారంలో ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, భీమా నాయక్ ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి.
ఆనంద్ సింగ్ అల్లుడి పెత్తనం
హగరిబోమ్మనహళ్ళిలో భీమా నాయక్ ఇంటి ముందే ఆనంద్ సింగ్ కార్యాలయం ప్రారంభించడం ఈ గొడవలకు కారణం అయ్యాయని తెలిసింది. కంప్లీ నియోజక వర్గంలో ఆనంద్ సింగ్ అల్లుడు సందీప్ సింగ్ పెత్తనం చలాయిస్తున్నాడని గణేష్ రగిలిపోయారని, అందుకే దాడి చేసి ఉంటారని చర్చ జరుగుతోంది.