బీజేపీ ఎమ్మెల్యేపై కిడ్నాప్ కేసు: ఫొటోలతో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్!
బెంగళూరు: కర్ణాటకలో తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ వినియోగించుకుంటోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొంటున్న నేపథ్యంలో- దీన్ని వాయిదా వేయించడానికి పావులను కదుపుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులను వేస్తోంది. భారతీయ జనతాపార్టీ దూకుడును అడ్డుకట్ట వేయడానికి వ్యూహాలను రచిస్తోంది. అధికార కాంగ్రెస్-జేడీఎస్ కూటమి తొలి రోజు విజయవంతంగా శాసనసభలో బలపరీక్ష నిర్వహణను అడ్డుకుంది. రెండోరోజు ఏం జరుగుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
సభలో బీజేపీ సభ్యుల బైఠాయింపు: రాత్రంతా ధర్నా కొనసాగించాలని నిర్ణయం!
బీజేపీ ఎమ్మెల్యేపై కిడ్నాప్ కేసు..
కాంగ్రెస్ శాసన సభ్యుడు శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ కనిపించకుండాపోవడమే ఇప్పుడు కీలకంగా మారింది. ఆ ఉదంతాన్ని అడ్డు పెట్టుకుని బీజేపీ దూకుడును అడ్డుకోవడానికి కర్ణాటక కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తోంది. శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ కిడ్నాప్ అయ్యారని ఆరోపించింది. ఈ మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఎఎన్ గౌడ గురువారం రాత్రే బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్కు ఫిర్యాదు చేశారు. లక్ష్మణ్ సంగప్ప సావధి తమ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ను కిడ్నాప్ చేయడం లేదా ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా తరలించడం వంటి చర్యలు చేసి ఉంటారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్ట విరుద్ధంగా లక్ష్మణ్ సావధి తమ ఎమ్మెల్యేను నిర్బంధించి ఉంటారని ఫిర్యాదు చేశారు.
సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు..
శ్రీమంత్ బాలా సాహెబ్ పాటిల్ బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ సంగప్ప సావధితో కలిసి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించిన ఫొటోలను ఈ ఫిర్యాదు పత్రానికి జత చేశారు కాంగ్రెస్ నాయకులు. చెన్నై విమానాశ్రయంలో శ్రీమంత్ పాటిల్, లక్ష్మణ్ సావధి కలిసి ఉన్న రెండు ఫొటోలను వారు పోలీసులకు అందజేశారు. బుధవారం రాత్రి నుంచి శ్రీమంత్ కనిపించకుండా పోయారని, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బలపరీక్షను ఎదుర్కొనాల్సి ఉన్న సమయంలో తమ ఎమ్మెల్యేను అపహరించాల్సిన అవసరం బీజేపీకి ఏమొచ్చిందంటూ పీసీసీ నాయకులు ఆరోపిస్తున్నారు. బెంగళూరు నుంచి తొలుత చెన్నైకి అక్కడి నుంచి ముంబైకి తీసుకెళ్లారని అన్నారు. ఫలితంగా- శ్రీమంత్ పాటిల్ అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు.
శ్రీమంత్ పాటిల్ ఉదంతంపై కాంగ్రెస్ రచ్చ
అంతకుముందు- ఇదే విషయంపై కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) సభ్యులు సభలో తీవ్ర స్థాయిలో ఆందోళన చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సభ్యుడు దినేష్ గుండూరావు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్ సైతం సభలో ప్రస్తావించారు. శ్రీమంత్ పాటిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోలను ఆయన సభలో ప్రదర్శించారు. తనతో పాటు దేవనహళ్లిలోని ప్రకృతి రిసార్ట్స్లో ఉన్న శ్రీమంత్ పాటిల్ను బీజేపీ నాయకులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని డీకే శివకుమార్ ఆరోపించారు. తన తండ్రిని కిడ్నాప్ చేశారని శ్రీమంత్ పాటిల్ పిల్లలు తన దృష్టికి తీసుకొచ్చారని డీకేశి చెప్పారు. ఎనిమిదిమంది ఎమ్మెల్యేలతో కలిసి ఉన్న ఆయన.. రాత్రికి రాత్రి అదృశ్యం అయ్యారని, తెల్లారేసరికి ముంబై ఆసుపత్రిలో స్ట్రెచర్పై కనిపించారని అన్నారు.
ఆరా తీయాలంటూ స్పీకర్ ఆదేశం..
దీనిపై స్పీకర్ రమేష్కుమార్ స్పందించారు. కగ్వాడ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న కాంగ్రెస్ సభ్యుడు శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ కిడ్నాప్కు గురయ్యారని అధికారికంగా తనకు ఫిర్యాదు అందిందని స్పీకర్ వెల్లడించారు. మొదట- దీనిపై విచారణ జరిపించాలని ఆయన హోమ్ శాఖ మంత్రిని ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను అందజేయాలని సూచించారు. శ్రీమంత్ పాటిల్ ఎక్కడికెళ్లారు? ఎలా ఉన్నారు? బలపరీక్ష ఉన్న సమయంలో ఆయన ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనే అంశాలపై ఆరా తీయాలని చెప్పారు. నిజంగా చికిత్స కోసమే వెళ్లారా? లేక ఉద్దేశపూరక కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేది తేల్చాలని అన్నారు.