కంగనా రనౌత్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి... కర్ణాటక కోర్టు సంచలన ఆదేశాలు...
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కర్ణాటకలోని తుమకూరు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు (ఫస్ట్ క్లాస్) పోలీసులను ఆదేశించింది. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై నిరసనలు తెలుపుతున్న రైతుల మనోభావాలను గాయపరిచేలా కంగనా కొన్ని ట్వీట్లు చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. అక్టోబర్ 5న దీనిపై తీర్పును రిజర్వ్లో పెట్టిన కోర్టు తాజాగా కంగనాపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలిచ్చింది.
రమేష్ నాయక్ పిటిషన్...
న్యాయవాది రమేష్ నాయక్ రైతు నిరసనలపై కంగనా ట్వీట్లను సవాల్ చేస్తూ సెప్టెంబర్ 21న తుమకూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో కంగనా ట్వీట్లను ప్రస్తావించారు. 'పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి అల్లర్లకు కారణమైనవాళ్లే... ఇప్పుడు రైతు బిల్లులపై కూడా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి దేశంలో టెర్రర్ సృష్టిస్తున్నారు.. వాళ్లు టెర్రరిస్టులు...' అని కంగనా తన ట్వీట్లో పేర్కొన్నారు.
పిటిషన్లో ఏముంది...
'కంగనా చేసిన ట్వీట్లు భిన్న భావజాలం కలిగిన రెండు గ్రూపుల మధ్య చిచ్చు రేపే అవకాశం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం,పోలీసులు కూడా ఈ ట్వీట్లను చూసీ చూడనట్లే వదిలేసినట్లు కనిపిస్తోంది. అందుకే సుమోటో కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఇలాంటి కంటెంట్ను సోషల్ ప్లాట్ఫామ్స్లో పోస్టింగ్కి అనుమతిస్తే... ఈ దేశంలో రైతులకు తీరని నష్టం జరిగే అవకాశం ఉంది. ఇలాంటి కంటెంట్ను పోస్టు చేస్తున్నవారు... దీన్ని ప్రోత్సహిస్తున్నవారు... ఇద్దరూ కలిసి ఈ దేశానికి వెన్నెముక అయిన రైతు ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. దేశంలో హింసను రెచ్చగొట్టి అస్థిరత ఏర్పరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటివాళ్లపై సెక్షన్ 33,108,153,153A,504ల కింద కేసులు నమోదు చేయాలి.' అని రమేష్ నాయక్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
Recommended Video
వ్యవసాయ చట్టాలపై నిరసనలు...
రైతులపై ఇలాంటి ట్వీట్లు చేసిన కంగనాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఆదేశాలివ్వాలని రమేష్ నాయక్ న్యాయస్థానాన్ని కోరారు. నాయక్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం క్యాతసండ్రా పోలీసులు కంగనాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు. దీనిపై కంగనా రనౌత్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కాగా,ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయకల్పన) బిల్లు-2020, ధరల హామీ-వ్యవసాయ సేవల బిల్లు(సాధికారత,రక్షణ)లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లుల కారణంగా కనీస మద్దతు ధరకు కూడా నోచుకోని పరిస్థితులు ఏర్పడుతాయని... కార్పోరేట్ల దయా దాక్షిణ్యాలపై రైతులు ఆధారపడాల్సి వస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయాన్ని కూడా కార్పోరేట్లు ఆక్రమిస్తే దేశంలో ఆకలి సమస్యలు కూడా తీవ్రమవుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో రైతులు ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసలకు దిగగా... కంగనా వాటిపై ట్విట్టర్లో తీవ్ర స్థాయిలో స్పందించారు.