సంక్షోభంలో కర్ణాటక సర్కార్ : 13 మంది ఎమ్మెల్యేల రాజీనామా
బెంగళూరు : కర్ణాటక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టడంతో .. కుమారస్వామి సర్కార్ ఒక్కసారిగా ఉలిక్కిపడిండి. కాంగ్రెస్, జేడీఎస్ సర్కార్కు ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు ఝలక్ ఇచ్చారు. ఎమ్మెల్యేల రాజీనామా చేసినట్టు స్పీకర్ కూడా ధ్రువీకరించారు. అమెరికాలో ఉన్న సీఎం కుమారస్వామి ఆగమేఘాల మీద బయల్దేరారు. కాంగ్రెస్ తమ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ను రంగంలోకి దింపి .. పరిస్థితిని సమీక్షిస్తోంది.
13 మంది ఎమ్మెల్యేల రాజీనామా ..
కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది, జేడీఎస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. అక్కడినుంచి నేరుగా స్పీకర్ కార్యాలయానికి వెళ్లి తమ రాజీనామా పత్రాలను అందజేశారు. ఈ విషయాన్నిస్పీకర్ కూడా ధ్రువీకరించారు. ఎమ్మెల్యేల తీరుతో కాంగ్రెస్-జేడీఎస్ హైకమాండ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నష్ట నివారణ చర్యల కోసం మంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ను రంగంలోకి దింపింది. ఆయన తన నియోజకవర్గం కననపురలో ఉండగా .. వెంటనే బెంగళూరు రావాలని ఆదేశించింది. ఇటు కర్ణాటక పీసీసీ చీఫ్ దినేశ్ గుండురావు కూడా విదేశాల్లో ఉండగా .. వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ కంద్రే రంగంలోకి దిగారు. మిగతా కాంగ్రెస్ నేతలను ఎమ్మెల్యే రామలింగ రెడ్డి నివాసానికి తరలిస్తున్నారు.

ఆగమేఘాల మీద ..
ఇటు కర్ణాటక సీఎం కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు తెలిసి ఆగమేఘాల మీద ఇండియా బయల్దేరారు. షెడ్యూల్ ప్రకారం ఆయన సోమవారం రావాల్సి ఉంది. కానీ మారిన రాజకీయ పరిస్థితులతో రెండురోజుల ముందుగానే భారత్ వచ్చేస్తున్నారు. ఇటు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పరమేశ్వర, మంత్రి డీకే శివకుమార్ అత్యవసరంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో వీరు సాయంత్రం భేటీ కానున్నారు. అమెరికా నుంచి కుమారస్వామి వచ్చేలోపు సిచుయేషన్ను తమకు అనుకూలంగా తీసుకునేందుకు శతవిధలా ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications