జేడీఎస్-కాంగ్రెస్కు ఇద్దరు ఎమ్మెల్యేల షాక్, రిలాక్స్గా కుమారస్వామి: '2-3 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం
బెంగళూరు: కర్ణాటకలో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత, మంత్రి శివకుమార్ రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి చిక్కులు వస్తాయని అభిప్రాయపడ్డారు. దానిని ఎలా హ్యాండిల్ చేయాలో తనకు తెలుసునని ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పారు. కానీ శివకుమార్ చెప్పిందే జరుగుతోన్నట్లుగా కనిపిస్తోంది.
కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఇద్దరు స్వతంత్ర్య అభ్యర్థులు మంగళవారం సంచలన ప్రకటన చేశారు. ఇండిపెండెంట్లు అయిన హెచ్ నగేష్, ఆర్ శంకర్లు తమతో టచ్లో ఉన్నారని భారతీయ జనతా పార్టీ (బీజేప) నేతలు కూడా చెబుతున్నారు. మరోవైపు, వారాంతంలోగా కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం, ఊహించని మలుపులు ఖాయమని కర్ణాటక బీజేపీ నేతలు చెబుతున్నారు.
నేను పూర్తి ప్రశాంతంగా ఉన్నా
స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఉపసంహరించడంపై ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. ఇద్దరి మద్దతు ఉపసంహరణ.. అది కేవలం సంఖ్య మాత్రమే అన్నారు. తాను పూర్తిగా ప్రశాంతంగా ఉన్నానని, తమ బలం ఏమిటో తమకు బాగా తెలుసునని చెప్పారు. వారం రోజులుగా మీడియాలో ప్రచారాన్ని ఆస్వాదిస్తున్నానని సెటైరిక్గా మాట్లాడారు. ఇదంతా కర్ణాటక ప్రజల ఆనందం కోసమని (ఎంటర్టైన్మెంట్) అన్నారు.
బీజేపీ ప్రయత్నాలు
ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఉపసంహరణపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర కూడా స్పందించారు. డబ్బు, అధికార బలంతో బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతోందని చెప్పారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని, కానీ అవి విఫలమవుతాయని అన్నారు. తమది స్థిరమైన ప్రభుత్వామని చెప్పారు.
నరేంద్ర మోడీని టార్గెట్ చేసిన సిద్ధరామయ్య
ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంపై కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీని ఆయన టార్గెట్ చేశారు. మిస్టర్ సాఫ్ నియత్ నరేంద్ర మోడీగారూ.. మీ కర్ణాటక లీడర్లు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని విమర్శించారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని అభిప్రాయపడ్డారు. మొదట మీ నీతి నిజాయితీలను ప్రజలకు చూపించాలన్నారు.
బీజేపీ నేతలు ఏమన్నారంటే
శుభవార్త కోసం వేచి చూడాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప తమ పార్టీ ఎమ్మెల్యేలకు మంగళవారం చెప్పారని తెలుస్తోంది. జేడీఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం పతనమైతే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మరో బీజేపీ నేత సదానంద గౌడ అన్నారు. బీజేపీ మహారాష్ట్ర ఎమ్మెల్యే, మంత్రి రామ్ షిండే మాట్లాడుతూ... రెండు మూడ్రోజుల్లో తమ పార్టీ (బీజేపీ) కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. కర్ణాటకలో బీజేపీయే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అన్నారు. కొద్ది రోజుల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తారని ఆశించారు.
ఇద్దరు స్వతంత్రుల మద్దతు ఉపసంహరణతో పాటు మరో షాక్
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తమ పార్టీకి చెందిన 104 మంది ఎమ్మెల్యేల్లోని 99 మందిని బీజేపీ ఢిల్లీలోని ఓ ప్రయివేటు రిసార్టుకు తరలించింది. వారు ప్రస్తుతం ప్రయివేటు రిసార్టులోనే ఉన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ నేతలు తమ ఎమ్మెల్యేల వైపు చూస్తున్నందునే బీజేపీ వారిని రిసార్టుకు తరలించిందని చెబుతున్నారు. కాంగ్రెస్ -జేడీఎస్.. బీజేపీపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తే, బీజేపీ కూడా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలపై అదే ప్రయోగం చేస్తోందని తెలుస్తోంది. ఇద్దరు స్వతంత్రులు మద్దతు ఉపసంహరించడంతో పాటు ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముంబైలోనని హోటల్లో బీజేపీ నేతల ఆధ్వర్యంలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.
బీజేపీ నేతలతో టచ్లో
కాంగ్రెస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారని, వారిని ఢిల్లీ తీసుకెళ్లినట్టు కూడా మీడియాలో రావడంతో కాంగ్రెస్, జేడీఎస్ అప్రమత్తమైంది. ఉత్తర, దక్షిణ కర్ణాటక నేతలు ఎవరూ జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి బయటకు వెళ్లకుండా ఇద్దరు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. మండ్య నేత పుట్టరాజు, బీదర్ నాయకుడు బండెప్ప కాశంపూర సంకీర్ణ సర్కారులోని ఎమ్మెల్యేలందరితో తరచుగా మాట్లాడేలా బాధ్యత తీసుకున్నారు. మరోవైపు, సోమవారం సాయంత్రం బీజేపీ తమ ఎమ్మెల్యేలను ఒక్కచోటకు చేర్చడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలిసి.. రేస్ కోర్సు రోడ్డులోని కేపీటీసీఎల్ భవన్ (శక్తిభవన్)కు సీఎం కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్, మంత్రి డికె శివకుమార్ చేరుకున్నారు. ఆపరేషన్ కమలను అడ్డుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.
మద్దతు ఉపసంహరించిన ఎమ్మెల్యేలు ఏంచెప్పారంటే
మద్దతు ఉపసంహరించుకున్న ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. ఈ రోజు మకర సంక్రాంతి అని, ఈ ప్రభుత్వం వద్దని కోరుకుంటున్నారని, అందుకే తాను మద్దతు ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. తాను ప్రభుత్వానికి మద్దతిచ్చానని, కానీ ఈ ప్రభుత్వం విఫలమైందని మద్దతు ఉపసంహరించుకున్న మరో ఎమ్మెల్యే నగేష్ చెప్పారు. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల్లో కలిసిపోయేతత్వం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే తాను బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నానని, బీజేపీకి అండగా నిలబడతానని చెప్పారు.