అసెంబ్లీలోనే భోజనం..అక్కడే నిద్ర! దిండు, దుప్పటి తీసుకెళ్లి కునుకు తీసిన సభ్యులు
బెంగళూరు: భారతీయ జనతాపార్టీ కర్ణాటక రాష్ట్రశాఖ శాసన సభ్యులు అన్నంత పనీ చేశారు. స్పీకర్ రమేష్కుమార్ అర్ధాంతరంగా సభను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ రాత్రంతా సభలోనే నిద్రపోయారు. దిండు, దుప్పటి పట్టుకెళ్లి మరీ సభలోనే కునుకు తీశారు. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సహా ఆ పార్టీకి చెందిన 105 మంది సభ్యుల్లో ఏ ఒక్కరు కూడా అసెంబ్లీ నుంచి బయటికి వెళ్లలేదు. అసెంబ్లీకే భోజనాలను తెప్పించుకున్నారు. అసెంబ్లీ గ్యాలరీలో భోజనం చేశారు. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ చాలాసేపటి వరకు గడిపారు. అనంంతరం ఒక్కొక్కరుగా వెళ్లి సభలో దుప్పటి పరచుకుని బజ్జున్నారు.
కర్నాటకంతో
మరోసారి
ఫిరాయింపులపై
చర్చ..
చట్టం
ఏం
చెబుతోంది..
మరి
నేతలు
చేస్తున్నదేంటి?
పొద్దున్నంతా ఖద్దరు దుస్తుల్లో..రాత్రికల్లా షార్ట్స్, టీషర్టులతో
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ప్రస్తుతం బలపరీక్షను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. సమావేశాల తొలిరోజైన గురువారం నాడు బలపరీక్ష నిర్వహించకుండానే స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. దీన్ని నిరసిస్తూ బీజేపీ సభ్యులు రాత్రంతా సభలోనే బైఠాయించారు. రాత్రి వరకూ అవుట్ అండ్ అవుట్ ఖద్దరు దుస్తుల్లో కనిపించిన బీజేపీ సభ్యులంతా.. రాత్రయ్యే సరికి తమ గెటప్ను మార్చేశారు. షార్ట్స్, టీషర్ట్స్ ధరించి కనిపించారు. ఎవరు ఎవరో పోల్చుకోవడం కష్టమైందనిపించేంతలా మారిపోయారు. చాలామంది సభ్యులు మెడలో టవల్తో కనిపించారు. షార్ట్స్, టీ షర్ట్స్, దిండు, దుప్పట్లను ఇంటి నుంచి తెప్పించుకున్నారు.
బారులు తీరిన కుటుంబ సభ్యులు
బీజేపీకి చెందిన 105 మంది సభ్యులూ ఒకే చోట ఉండాల్సిన పరిస్థితి రావడంతో- అసెంబ్లీ భవన సముదాయం కోలాహలంతో నిండిపోయింది. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు చాలామంది అసెంబ్లీ ఆవరణలో కలియ తిరుగుతూ కనిపించారు. నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, బెంగళూరుకు దగ్గర్లో ఉన్న నియోజకవర్గాల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు రాత్రికల్లా అసెంబ్లీకి చేరుకున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. అదనపు భద్రతా బలగాలను మోహరింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వచ్చీ, పోయే వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేశారు.
రోజంతా హైడ్రామా!
అంతకుముందు- సభలో హైడ్రామా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గవర్నర్ వజూభాయ్ వాలా అధికారికంగా పంపించిన సందేశానికి స్పీకర్ రమేష్ కుమార్ తప్పనిసరిగా బదులు ఇచ్చి తీరాలని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప పట్టుబట్టారు. స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించేంత వరకూ తాము సభను వదిలి వెళ్లబోమని చెప్పారు. ఏ ఒక్క సభ్యుడు కూడా సభ నుంచి బయటికి వెళ్లబోడని, స్పీకర్ వెంటనే సభను మరోసారి సమావేశ పర్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ స్థానాన్ని సైతం కాంగ్రెస్-జేడీఎస్ నాయకులు కించపరుస్తున్నారని ఆరోపిస్తున్నారు. బలపరీక్ష నిర్వహణపై గవర్నర్ స్పష్టమైన ఆదేశాలను అందజేశారని, దాన్ని స్వయంగా తానే సభలో చదివి వినిపించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినప్పటికీ- స్పీకర్ వాటిని బేఖాతర్ చేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ధ్వజమెత్తారు. గవర్నర్ స్థానాన్ని అవమానించారని యడ్యూరప్ప మండిపడ్డారు.
గవర్నర్ జోక్యాన్ని తప్పుపడుతోన్న కాంగ్రెస్
అంతకుముందు- ఇదే అంశంపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. శాసనసభా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదని అంటున్నారు. గవర్నర్ పక్కా భారతీయ జనతాపార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిన విషయం గవర్నర్కు తెలియదా? అని మండిపడుతున్నారు. సుప్రీంకోర్టు నుంచి నిర్దేశిత లిఖతపూరక ఆదేశాలు గానీ, ఉత్తర్వులు గానీ అందనప్పటికీ- శాసనసభలో బలపరీక్షను నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం కాదా? అని కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ వజూభాయ్ వాలాను నిలదీస్తున్నారు. శాసనసభ నియమ, నిబంధనల ప్రకారమే బలపరీక్ష కొనసాగుతుందే తప్ప గవర్నర్ సూచనల మేరకు కాదని విమర్శిస్తున్నారు.